న్యూఢిల్లీ, డిసెంబర్ 7: వాహన ధరల పెంపు జాబితాలోకి తాజాగా హ్యుం దాయ్ కూడా చేరింది. వచ్చే నెల నుంచి అన్ని రకాల వాహన ధరలను పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం అధికమవడం, ఎక్సేంజ్ రేట్లలో మార్పులు, కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల వాహన ధరలను పెంచకతప్పడం లేదని కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. జనవరి 1 నుంచి అమలులోకి రానున్న ఈ ధరలు ఎంత శాతం మేర పెంచుతున్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం సంస్థ రూ.5.84 లక్షల గ్రాండ్ ఐ10 నియోస్ మొదలుకొని రూ.45.95 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయోనిక్5ను దేశీయంగా విక్రయిస్తున్నది. ఇప్పటికే మారుతి, టాటా మోటర్స్, మహీంద్రా, హోండా, ఆడీలు వాహన ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి.
డుకాటీ కూడా..
ఇటలీకి చెందిన సూపర్బైకుల తయారీ సంస్థ డుకాటీ.. ఎంపిక చేసిన మాడళ్ల ధరలను వచ్చే నెల నుంచి పెంచుతున్నట్టు ప్రకటించింది. నిర్వహణ వ్యయం అధికమవడం, ఉత్పత్తికయ్యే ఖర్చులు కూడా పెరగడం వల్లనే ధరలు సవరించాల్సి వచ్చిందని డుకాటీ ఇండియా ఎండీ బిపుల్ చంద్ర తెలిపారు.