Hyundai | గతంతో పోలిస్తే ఎంట్రీ లెవెల్ కార్లు, హ్యాచ్బ్యాక్ మోడల్ కార్ల కంటే ఎస్యూవీలకు గిరాకీ పెరిగింది. ఈ క్రమంలో దిగుమతి చేసుకున్న కార్లకు, దేశీయంగా తయారైన కార్లకు, ఎలక్ట్రిక్ ఎస్యూవీలకు మధ్య పోటీ పెరుగుతున్నది. ప్రత్యేకించి టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు ఎస్యూవీ కార్ల మార్కెట్లోకి తేవడానికి.. తమ వాటా పెంచుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో తన స్థానాన్ని కాపాడుకునేందుకు దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ ప్లాన్ ఖరారు చేసుకుంది. వివిధ ఆటోమొబైల్ సంస్థలతో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడేందుకు సిద్ధమైంది.
గతేడాది వరకు దక్షిణ కొరియా మేజర్ కార్లు ఎస్యూవీ మార్కెట్లో ఆకర్షణీయంగా ఉండేవి. ఈ పట్టును కాపాడుకునేందుకు లగ్జరీ టక్సన్ ఎస్యూవీ కారును బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. అమెరికాతోపాటు గ్లోబల్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్ కారుగా న్యూ జనరేషన్ టక్సన్ నిలిచింది.
జీప్ కంపాస్, టయోటా ఫార్చ్యూనర్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్, మహీంద్రా ఎక్స్యూవీ 700, టాటా హారియర్తో ఎంట్రీ లగ్జరీ మార్కెట్లో పోటీ పడేందుకు హ్యుండాయ్ కసరత్తు చేస్తున్నది. రెండు లీటర్ల పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో టక్సన్ వస్తున్నది. పెట్రోల్ వేరియంట్ రూ.27.7 లక్షలు, డీజిల్ వేరియంట్ రూ.30.2 లక్షలకు లభిస్తుంది.
ఎస్యూవీ క్యాటగిరీలో మార్కెట్ వాటాను కోల్పోవడానికి సిద్ధంగా లేమని హ్యుండాయ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ చెప్పారు. మహీంద్రా, టాటా మోటార్స్ వంటి దేశీయ ఆటో మేజర్లతోపాటు టయోటా-మారుతి సంయుక్తంగా ఆవిష్కరిస్తున్న కార్ల నుంచి హ్యుండాయ్ ఎస్యూవీ కారు క్రెటాకు గట్టి పోటీ నెలకొందన్నారు. మున్ముందు ఎస్యూవీ కార్లకు గల డిమాండ్ను బట్టి అత్యధిక ఎస్యూవీ కార్లను మార్కెట్లోకి తేవడంపై దృష్టి సారించామని, దూకుడుగా ముందుకెళ్తామన్నారు.