హైదరాబాద్, డిసెంబర్ 2: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా).. ఈ నెల 16న హెచ్ఐసీసీ వద్ద తమ ప్రతిష్ఠాత్మక వార్షిక సదస్సును నిర్వహించనున్నది. ఈ 29వ వార్షిక ఇన్నోవేషన్ సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నట్లు హైసియా అధ్యక్షుడు భరణి కుమార్ ఆరోల్ తెలియజేశారు. గురువారం ఇక్కడ జరిగిన సమావేశంలో సదస్సు బ్రోచర్ను భరణి విడుదల చేశారు.
కేటీఆర్ చేతుల మీదుగా అవార్డులు
ఎగుమతులు, ఉత్పత్తి, ఉత్పాదక అభివృద్ధిలో దూసుకుపోతున్న ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు, స్టార్టప్లకు కేటీఆర్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరుగనున్నది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)తో కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం థీమ్ ‘డిజిటల్ కన్వర్జెన్స్: టచింగ్ లైవ్స్ అండ్ బిజినెస్’. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖల సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. పరిశ్రమ వృద్ధిలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర, వివిధ రంగాలపై, మనుషులపై దాని ప్రభావం వంటి అంశాలపై ఇందులో చర్చించనున్నారు. నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలిచే ఈ సదస్సులో నగరంలోని ప్రముఖ ఐటీ సంస్థలు, స్టార్టప్లతోపాటు వియ్-హబ్, టీ-హబ్, టై, టీఎస్ఐసీ, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రతినిధులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు మొత్తం 500 మందికిపైగా పాల్గొంటారని భరణి వెల్లడించారు. వీరిలో టీసీఎస్ సీవోవో, ఈడీ ఎన్జీ సుబ్రమణ్యం, ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ ఓంకార్ రాయ్ వంటి దాదాపు 200 మంది ఉన్నతస్థాయిలవారుంటున్నారు. కాగా, 30కిపైగా స్టార్టప్లు తమ నూతన ఆవిష్కరణలను ఈ సదస్సులో ప్రదర్శించనుండగా.. ఎమర్జింగ్ ప్రోడక్ట్, ఫాస్ట్ గ్రోయింగ్ ఎంటర్ప్రైజ్ ప్రోడక్ట్, ఫాస్ట్ గ్రోయింగ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్, ఎస్టాబ్లీష్డ్ ప్రోడక్ట్, ప్రోడక్ట్ విత్ సోషల్ ఇంపాక్ట్, ప్రోడక్ట్ లెడ్ బై వుమెన్ కేటగిరీల్లో అవార్డుల కోసం అవి పోటీపడనున్నాయి. హైదరాబాద్లోని హాట్ 10 స్టార్టప్లనూ ఈ సందర్భంగా హైసియా ఎంపిక చేయనున్నది.
హైదరాబాద్లోని ఎస్టీపీఐలో నమోదైన ఐటీ, ఐటీ ఆధారిత సేవల సంస్థలు.. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో ఎగుమతులు 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఏప్రిల్-సెప్టెంబర్లో ఈ కంపెనీలు రూ.45,000 కోట్ల విలువైన ఐటీ సర్వీసులను ఎగుమతి చేసినట్లు ఎస్టీపీఐ (హైదరాబాద్) డైరెక్టర్ సీవీడీ రాంప్రసాద్ తెలిపారు. కాగా, ఎస్టీపీఐలో నమోదు కాని సంస్థల ఎగుమతుల్నీ కలిపితే ఇది మరింత ఎక్కువగా ఉంటుందని హైసియా అధ్యక్షుడు భరణి కుమార్ ఆరోల్ అన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2020-21) రాష్ట్ర ఐటీ పరిశ్రమలోగల ఎస్టీపీఐ, నాన్-ఎస్టీపీఐ సంస్థల ఎగుమతులు రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇదిలావుంటే గడిచిన రెండు త్రైమాసికాల్లో వృద్ధిరేటు చాలా ఎక్కువగా ఉందని హైసియా కార్యక్రమానికి హాజరైన రాంప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. జాతీయ సగటు కంటే రాష్ట్ర ఎగుమతుల వృద్ధిరేటు ఎక్కువగా ఉన్నదన్నారు. వచ్చే ఐదేండ్లలో తెలంగాణ వార్షిక ఐటీ ఎగుమతులు రూ.3 లక్షల కోట్లకు చేరాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీ 2021-26ను ప్రారంభించిన విషయం తెలిసిందే.