Greanary Homes | ఇది కరోనా కాలం.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా పరిస్థితులతో రాజీ పడేందుకు సిద్ధ పడుతున్నారు.. వర్క్ ఫ్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం కల్చర్ మొదలైంది. దీంతో సొంతిండ్లకు గిరాకీ పెరుగుతున్నది. అదే సమయంలో కొనుగోలుదారుల సెంటిమెంట్, వైఖరిలో గణనీయ తేడా కనిపిస్తోంది. హైదరాబాదీల్లో 80 శాతం మంది తమ ఇంటి విలువ వచ్చే 12 నెలల్లో 10-19 శాతానికి పై చిలుకు పెరుగుతుందని విశ్వసిస్తున్నారని నైట్ ఫ్రాంక్ నిర్వహించిన సర్వేలో తేలింది. ధర పెరుగుతుందన్న అంచనా మధ్య సెకండ్ హోం కొనడానికి సుమారు 55 శాతం మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
కరోనా తొలి రోజుల్లో సగం మందికి పైగా ఇండ్ల విలువ పడిపోతుందని అభిప్రాయపడ్డారు. దీంతో పోలిస్తే ఇప్పుడు తమ ఇండ్లకు గిరాకీ వస్తుందని.. విలువ ఎక్కువవుతుందని ఆశావాహ ద్రుక్పథం గల వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇండియా బయ్యర్ సర్వే 2021- లివింగ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కోవిడ్-19 అనే పేరుతో జరిగిన అధ్యయనంలో సగానికి పైగా నగర వాసులు హైదరాబాద్ పరిధిలో కొత్తిల్లు కొనేందుకు విముఖత ప్రదర్శిస్తున్నారు.
హైదరాబాదీలు భవిష్యత్లో రెండో ఇల్లు కొనుగోలు చేయాలన్న ఆసక్తి పెరగడానికి కీలక అంశాలు బయటపడ్డాయి. కుటుంబ పరిమాణం పెరిగితే భవిష్యత్లో మరో ఇల్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని 43 శాతం మంది అభిప్రాయ పడ్డారు. ఇప్పుడు ఉన్న ఇంట్లో వసతులు పెంచుకోవాలన్న ప్రతిపాదన కీలకం అని 22 శాతం మంది పేర్కొన్నారు. 12 శాతం మంది హాలీడే హోం కావాలనుకుంటే రెండో ఇల్లు కొనడానికి ముందుకు వెళతామన్నారు.
భారీ గ్రీనరీ స్పేస్ ఉన్న ఇండ్ల కొనుగోళ్లకు ప్రాధాన్యం పెరుగుతుతందని 97 శాతం మంది భాగ్యనగర వాసులు తెలిపారు. తమ ఇండ్లకు మంచి ఆరోగ్య పరిరక్షణ వసతులు అందుబాటులో ఉండేలా 91 శాతం, 78 శాతం మంది ఆఫీసులకు సమీపాన కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతామని వ్యాఖ్యానించారు.
54 శాతం మంది కొత్తింటికి మారడానికి మొగ్గు చూపుతున్నారు. 58 శాతం మంది మరింత ఓపెస్ స్పేస్, ఔట్ డోర్ స్పేస్ కావాలని కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారి వల్ల తమ ఇల్లు మారాలన్న నిర్ణయం మారబోదని 76 శాతం మంది హైదరాబాదీలు పేర్కొన్నారు.
హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్లో చాలా ఆశావాహ ద్రుక్పథం ఉండటానికి, కొనుగోలు దారుల సెంటిమెంట్ బలోపేతం కావడానికి కీలక అంశాలు ఉన్నాన్నారు. ఐటీ సంస్థలు తమ కోర్ బిజినెస్ పెరగాలని ఆశిస్తున్నారు. మున్ముందు కూడా హైదరాబాద్ నివాస యోగ్య కేంద్రంగా కొనసాగుతుందని నైట్ ఫ్రాంక్ చీఫ్ ఎకనమిస్ట్, నేషనల్ డైరెక్టర్ రజనీ సిన్హా అభిప్రాయ పడ్డారు. డబ్బు ఖర్చు చేసే విషయంలో ఇండ్ల కొనుగోలు పట్ల హైదరాబాదీలు సానుకూలంగా ఉండటం ఆశ్చర్యకరం అని చెప్పారు.