హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని బెంగళూరులోని కెనడా కాన్సుల్ జనరల్ బెనాయిట్ ప్రిఫోంటైస్ తెలిపారు. అనతికాలంలోనే హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీగా అవతరించిందని, ఇక్కడ ప్రపంచస్థాయి వసతులన్ని ఉన్నాయని శుక్రవారం హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐ (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ)లో జరిగిన సదస్సులో బెనాయిట్ చెప్పారు. ఒకప్పుడు కెనడా ఉత్తర భారతంలోనే పెట్టుబడులు పెట్టిందని, కానీ ప్రస్తుతం హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉందన్నారు.
రాష్ట్రంలో ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఏరో స్పేస్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ సర్కారు చూపిస్తున్న చొరవ అద్భుతంగా ఉండటంతో పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. సౌత్ ఇండియా సీనియర్ ట్రేడ్ కమిషనర్, బెంగళూరులోని కెనడా కాన్సులేట్ జనరల్ కెన్నెత్ వాంగ్ మాట్లాడుతూ.. ఉత్తర భారతంలోని కెనడా వాణిజ్య వ్యాపారాన్ని దక్షిణాదికి విస్తరింపచేయడానికి కృషి చేస్తున్నట్లు, తెలంగాణ సర్కారుతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. ఎఫ్టీసీసీఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ… హైదరాబాద్లో పెట్టుబడుల కోసం కెనడాను ఆహ్వానించేందుకే ఈ సమావేశం నిర్వహించామని, ముఖ్యంగా ఐటీ, ఫార్మా, రక్షణ రంగం, వ్యవసాయం తదితర రంగాలు వేగంగా పురోగతి సాధిస్తున్నదని చెప్పారు.