Himachal Pradesh CM | పర్యావరణ పరిరక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సంప్రదాయంగా పెట్రోల్, డీజిల్లతో నడిచే వాహనాల కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలేవీ కూడా 2024 జనవరి ఒకటో తేదీ (సోమవారం) నుంచి డీజిల్, పెట్రోల్లతో నడిచే వాహనాలను కొనుగోలు చేయవద్దని ఆదేశించారు. ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడంతోపాటు ‘గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ప్రదేశ్’ లక్ష్య సాధనకు దోహదం చేస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ శాఖలు పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు కొనాలంటే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న ఈ- వాహనాల సంఖ్య 185, ప్రైవేట్ ఈ- వాహనాలు 2733గా ఉందని సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. రాష్ట్రంలో ఈ-వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. అధికారిక వాహనాలన్నీ ఈ-వాహనాలతో భర్తీ చేసిన తొలి శాఖగా రవాణాశాఖ నిలిచిందన్నారు. ఇతర శాఖలు, విభాగాలు కూడా పూర్తిగా ఈ-వాహనాల వాడకం దిశగా మారేలా చూడాలన్నారు.