Changes From July 1 | శుక్రవారం నుంచి నూతన లేబర్ కోడ్లు అమల్లోకి రానుండటంతో వివిధ సంస్థల ఉద్యోగులు, కంపెనీల కార్మికులు ఇండ్లకు తీసుకెళ్లే వేతనం, పని గంటలతోపాటు వివిధ వర్గాల వారిపై వడ్డించే పన్నులు తదితరాలు మారతాయి. న్యూ వేజ్ కోడ్తోపాటు నూతన కార్మిక చట్టాలు అమలు చేయడంతో ఉద్యోగి/ కార్మికుడు ప్రతి నెలా ఇంటికి తీసుకెళ్లే వేతనం, ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్)లో కంట్రిబ్యూషన్ వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మారిపోనున్నాయి. పనిగంటల్లో ( Work Hours ) పెరుగుదల, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగుల వేతనాలు తగ్గుముఖం పడతాయి. ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్లు, డాక్టర్లపై టీడీఎస్ రూల్స్ తదితరాలు మారతాయి. క్రిప్టో కరెన్సీ లావాదేవీలపైనా టీడీఎస్ కూడా అమల్లోకి రాబోతున్నది.
ఇప్పటికీ ఆధార్-పాన్ కార్డు అనుసంధానించలేదా.. అయితే ఈ రోజే వాటిని అనుసంధానించండి. ఈ రోజు వరకు రూ.500 ఫైన్తో ఆధార్ – పాన్ కార్డులను అనుసంధానించేందుకు ఆదాయం పన్నుశాఖ అనుమతి ఇస్తుంది. ఈ రోజు దాటితే, శుక్రవారం నుంచి పాన్-ఆధార్ కార్డు లింక్ చేయాలంటే రూ.1000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000 ఫైన్తోనైనా పాన్- ఆధార్ అనుసంధానం వచ్చే ఏడాది (2023) మార్చి నెలాఖరు వరకు మాత్రమే అనుమతి ఇస్తారు. వచ్చే మార్చిలోగా పాన్-ఆధార్ కార్డులను లింక్ చేయకుంటే పాన్ కార్డులు పని చేయవు.
క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. క్రిప్టో కరెన్సీలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లు సహా అన్ని రకాల వర్చువల్ డిజిటల్ కరెన్సీ లావాదేవీలపై ఒకశాతం టీడీఎస్ మినహాయిస్తామని తెలిపింది. ఈ నిర్ణయం శుక్రవారం (2022, జూలై 1) నుంచి అమల్లోకి వస్తుంది. క్రిప్టో కరెన్సీలతో వచ్చే లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా టీడీఎస్ విధిస్తారు. నష్టపోయిన వారు తిరిగి క్లయిమ్ చేయవచ్చు. కనుక క్రిప్టో కరెన్సీ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆదాయం పన్ను రిటర్న్స్ సమర్పించడం మంచిదని నిపుణులు అంటున్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, డాక్టర్ల సేల్స్ ప్రమోషన్స్పై టీడీఎస్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇలా పొందే ప్రయోజనాలపై 10 శాతం టీడీఎస్ విధిస్తారు. ఇందుకోసం ఆదాయం పన్ను చట్టం- 1961లో కొత్తగా `194ఆర్` సెక్షన్ చేర్చారు. నూతన నిబంధన కింద కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో సేల్స్ ప్రమోషన్ల ద్వారా రూ.20 వేలు అంతకంటే ఎక్కువ ఆదాయం పొందిన వారిపై టీడీఎస్ విధిస్తారు. ఒక ఫార్మా కంపెనీ శాంపిల్స్ను ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుడు విక్రయిస్తే వచ్చే ఆదాయంపైనా టీడీఎస్ వసూలు చేస్తారు. విక్రయించిన శాంపిల్స్ విలువ రూ.20 వేలు అంత కంటే ఎక్కువ ఉంటే 10 శాతం టీడీఎస్ విధిస్తారు. ప్రైవేట్ దవాఖానలో పని చేసే వైద్యుడికీ ఈ నిబంధన వర్తిస్తుంది.
వచ్చేనెలలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు విడుదల చేయనున్న కరువు భత్యం (డీఏ) పెరుగనున్నది. ప్రతి ఏటా జనవరి, జూలైల్లో కేంద్రం కరువు భత్యం విడుదల చేస్తున్నది. చిల్లర ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో 2022 జూలైలో విడుదల చేయనున్న డీఏ కూడా సర్దుబాటు కానున్నదని సమాచారం.
సైబర్ ఫ్రాడ్లకు తెర దించేందుకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై అమలు చేయనున్న టోకెనైజేషన్ వ్యవస్థ తొలుత జూన్ 30తో ముగియాల్సి ఉంది. వివిధ పారిశ్రామిక సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అభ్యర్థనల మీద డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై జారీ చేయనున్న టోకెనైజేషన్ అమలును సెప్టెంబర్ 30 వరకు వాయిదా వేసింది ఆర్బీఐ.
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు లేబర్ కోడ్ల కింద ఇంకా రూల్స్ నిబంధనలు ఖరారు చేయలేదు. ఇప్పటి వరకు 23 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వేజ్ కోడ్ల కింద ముసాయిదా నిబంధనలు ప్రచురించాయని కేంద్ర కార్మికశాఖ మంత్రి రామేశ్వర్ తెలీ ఇటీవల లోక్సభలో రాత పూర్వక సమాధానంలో చెప్పారు.