న్యూఢిల్లీ, జూలై 28: భారతీయ మార్కెట్లో జాజ్, డబ్ల్యూఆర్-వీ, నాల్గోతరం సిటీ మోడల్ కార్లను ఆపేయాలని జపాన్ ఆటో దిగ్గజం హోండా భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది మార్చికల్లా ఈ మూడు మోడళ్లకు గుడ్బై చెప్పేయాలని యోచిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఇదే జరిగితే హోండా కార్స్ ఇండియాకు దేశీయ మార్కెట్లో ఇక అమ్మకానికి మిగిలేవి సిటీ హైబ్రిడ్, ఐదోతరం సిటీ, ప్రవేశస్థాయి సెడాన్ అమేజ్ మోడల్స్ మాత్రమే. ఇప్పటికే 2020 డిసెంబర్లో గ్రేటర్ నోయిడా ప్లాంట్ను మూసేయడంతో దేశీయంగా సివిక్, సీఆర్-వీ ఉత్పత్తిని హోండా ఆపేసింది. అయితే మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీ మోడల్స్ను పరిచయం చేయడానికే ఈ మోడల్స్ అన్నింటికీ హోండా బైబై చెప్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఇదిలావుంటే మార్కెట్ ఊహాగానాలపై సంస్థ స్పందించబోదంటూ హోండా కార్స్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు అన్నారు.