Lamborghini on Indian Market | భారత్లో కార్లపై అధిక పన్నుల వ్యవస్థ ఇటలీ ఆటోమేకర్ లంబోర్ఘినీ చైర్మన్ కం సీఈవో స్టీఫాన్ వింకిల్మాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్ వంటి దేశాల్లో సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్ విస్తరణకు అధిక పన్నులు పరిమితులు విధిస్తుందని పేర్కొన్నారు. అధిక పన్నుల సమస్య లేకపోతే భారత్లో లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధి చెందుతుందన్నారు. భారత్లో లంబోర్ఘినీ సూపర్ లగ్జరీ కార్ల ధరలు రూ.3.16 కోట్ల నుంచి మొదలవుతాయి. గతేడాది అంటే 2021లో అత్యధికంగా 69 కార్లు విక్రయించామని లంబోర్ఘినీ తెలిపింది. ఇంతకుముందు 2019లో 52 యూనిట్లు మాత్రమే విక్రయించింది.
ప్రపంచంలోని ఇతర దేశాల మార్కెట్ మాదిరిగానే భారత్లోనూ తమ మార్కెట్ వృద్ధి చెందుతుందని భావిస్తున్నామని వర్చువల్ వేదికగా జరిగిన ఓ సమావేశంలో స్టీఫాన్ వింకిల్ మాన్ చెప్పారు. ప్రస్తుత లగ్జరీ కార్లపై 28 శాతం జీఎస్టీతోపాటు కారు వేరియంట్ కం మోడల్ను బట్టి అదనంగా ఒకటి నుంచి 22 శాతం సెస్ విధిస్తున్నది కేంద్రం. కంప్లీట్లీ బిల్డ్ యూనిట్స్ (సీబీయూ) కార్లను దిగుమతి చేసుకోవడం వల్ల కస్టమ్స్ డ్యూటీ 60-100 శాతం మధ్య కేంద్రం వసూలు చేస్తున్నది.
ఇంజిన్ సైజ్ను బట్టి కస్టమ్స్ డ్యూటీలో మార్పులు చేర్పులు ఉంటాయి. ధర, ఇన్సూరెన్స్, రవాణా చార్జీలు కలిసి ఒక లగ్జరీ కారు ధర 40 వేల డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో అక్షరాలు రూ.3.2 కోట్లు అన్న మాట. భారత్ జనాభాను దృష్టిలో పెట్టుకుంటే ఏటా 100 లోపు కార్లు మాత్రమే విక్రయిస్తున్నట్లు స్టీఫాన్ వింకిల్మాన్ తెలిపారు.
భారత్లో ఆర్థిక మందగమనం ప్రభావం ఉన్నా, కార్ల విక్రయాలపై ప్రభావం ఉండబోదని లంబోర్ఘినీ భావిస్తున్నది. గత జనవరి-సెప్టెంబర్ మధ్య ప్రపంచవ్యాప్తంగా 7,430 కార్లు డెలివరీ చేసింది. గతేడాదితో పోలిస్తే ఇది ఎనిమిది శాతం ఎక్కువ. ఇంతకుముందు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్మస్క్ సైతం దిగుమతి కార్లపై భారత్లో అధిక సుంకాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాలు తగ్గిస్తే భారత్ మార్కెట్లోకి వస్తానని, అటుపై మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. కానీ, పాక్షికంగానైనా భారత్లో ఉత్పత్తి ప్రారంభిస్తే.. సుంకాల తగ్గింపుపై పునరాలోచిస్తామని కేంద్రం తెగేసి చెప్పడంతో వెనక్కు తగ్గారు ఎలన్మస్క్.