న్యూఢిల్లీ, నవంబర్ 21: మాంద్యం ముప్పు నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంకా బయటపడలేదన్న సంకేతాల్ని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ ఆహారోత్పత్తులు, ఇంధన ధరలు అధికస్థాయిలో కొనసాగుతున్నందున 2024లో మాంద్యం ముంచుకొచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన రిపోర్ట్లో హెచ్చరించింది. 2023 అక్టోబర్లో ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులపై కేంద్రం తాజాగా ఒక సమీక్షా నివేదికను వెలువరించింది.
ప్రపంచ వాణిజ్య పరిమాణం తగ్గుతున్నట్టు డబ్ల్యూటీవో గణాంకాలు చెపుతున్నాయని, ఈ నేపథ్యంలో భారత్ ఎగుమతుల విలువ క్షీణించడం, అదే సమయంలో దిగుమతులు విలువ పెరుగుతున్నదని, దీంతో అక్టోబర్లో వాణిజ్యలోటు రికార్డు గరిష్ఠానికి చేరిందని ఆర్థిక శాఖ వివరించింది. ఎగుమతులతో పోలిస్తే దిగుమతులు అధిక శాతం పెరుగుతున్నందున వాణిజ్యలోటు విస్త్రతమవుతున్నదని పేర్కొంది. 2022 అక్టోబర్తో పోలిస్తే 2023 అక్టోబర్లో పండుగ డిమాండ్తో వెండి, బంగారం దిగుమతులు దాదాపు రెట్టింపు అయ్యాయన్నది.
గ్రామీణ డిమాండ్ క్యూ1కంటే క్యూ2లో ఊపందుకుందని, ఆహార ధాన్యాల దిగుబడి ద్వారా స్థిరమైన ఆదాయం లభించడం, ద్రవ్యోల్బణం నెమ్మదించడం ఇందుకు కారణమని తెలిపింది. లీజర్, బిజినెస్ ట్రావెల్స్ జోరుతో టూరిజం, హోటల్ పరిశ్రమలు వృద్ధిచెందుతున్నాయని, దీంతో ముడి వ్యయాలు పెరుగుతున్నప్పటికీ, సర్వీసుల రంగం సెంటిమెంట్ బలపడిందని పేర్కొంది. అయితే రిజర్వ్బ్యాంక్ వరుస వడ్డీ రేట్ల పెంపు, ఇతర పాలసీ చర్యలు వ్యవస్థలోకి పూర్తిమార్పిడి జరిగిన తర్వాత దేశీయ డిమాండ్ తగ్గవచ్చని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.