Hero MotoCorp | దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) సెలెక్టెడ్ మోటారు సైకిళ్లు, స్కూటర్లపై ధరలు పెంచనున్నది. అక్టోబర్ మూడో తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయి. ఇన్ పుట్ కాస్ట్ పెరగడం వల్ల ధరలు పెంచక తప్పడం లేదని హీరో మోటో కార్ప్ తెలిపింది. ముడిసరుకు, లాజిస్టిక్, ప్రొడక్ట్ కాంపిటీటివ్నెస్ తదితర కారణాలతో ధరలు పెంచక తప్పడం లేదని శనివారం పేర్కొంది. ఆయా మోడల్ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని వెల్లడించింది. ధరలు పెరిగే స్కూటర్లు, మోటారు సైకిళ్ల జాబితాను వెల్లడించలేదు.
ప్రస్తుతం హీరో మోటో కార్ప్.. ఎంట్రీ లెవల్ స్ప్లెండర్ + నుంచి కొత్తగా ఆవిష్కరించిన కరిజ్మా ఎక్స్ఎంఆర్ వరకూ పలు రకాల మోటారు సైకిళ్లను తయారు చేస్తోంది. వీటితోపాటు అమెరికా కేంద్రంగా పని చేస్తున్న మోటారు సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు ఇటీవలే మార్కెట్లో ఆవిష్కరించిన డెస్టినీ ప్రైమ్ నుంచి ఫ్లాగ్ షిప్ మాస్ట్రో ఎడ్జ్ 125 వరకూ ఐదు రకాల స్కూటర్లు విక్రయిస్తోంది హీరో మోటో కార్ప్. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సెలెక్టెడ్ మోటారు సైకిళ్లపై ఒక శాతం ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఇంతకుముందు జూలైలో 1.5 శాతం ధరలు పెంచేసింది. పండుగల సీజన్ నేపథ్యంలో హీరో మోటో కార్ప్ తన మోటారు సైకిళ్లు, స్కూటర్ల ధరలు పెంచడం గమనార్హం.