GST Council Meet | జీఎస్టీ కౌన్సిల్ 52వ సమావేశం శనివారం జరుగనున్నది. ఈ సమావేశంలో కౌన్సిల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే చర్చ సాగుతున్నది. అయితే, జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనంతరం మద్యం కంపెనీలకు శుభవార్త అందనున్నట్లుగా తెలుస్తున్నది. సమాచారం ప్రకారం.. మొలాసిస్పై జీఎస్టీని 28శాతం నుంచి 5శాతానికి తగ్గించనున్నట్లు సమాచారం. చెరకు రసం నుంచి తెల్ల చక్కెరను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయే ద్రవం మొలాసిస్. మొలాసిస్ ఒక మందపాటి, చిక్కటి సిరప్. దీన్ని పులిబెట్టడం ద్వారా మద్యాన్ని తయారు చేస్తారు. రమ్ సైతం ఇదే పద్ధతిలో తయారు చేస్తుంటారు. మిల్లెట్స్పై సైతం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మిల్లెట్స్పై జీఎస్టీని 18శాతం నుంచి 12శాతానికి తగ్గించానలి జీఎస్టీ కౌన్సిల్ ఫిట్మెంట్ కమిటీ సిఫారసు చేసింది. మిల్లెట్స్తో తయారు చేసిన పిండి లూజ్ విక్రయాలపై ఎలాంటి జీఎస్టీని వసూలు చేయబోమని కమిటీ పేర్కొంది. ప్యాకింగ్ మిల్లెట్స్ విక్రయిస్తే 18శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. మిల్లెట్స్ను పిండిగా మార్చితే 12శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈవీ బ్యాటరీలపై జీఎస్టీని 18శాతం నుంచి 5శాతానికి తగ్గించాలని ఈవీ ఇండస్ట్రీ నుంచి డిమాండ్ ఉన్నది. ఈవీ బ్యాటరీలను బస్సులు, వాహనాల్లోనే కాకుండా మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువుల్లోనూ ఉపయోగిస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో జీఎస్టీ తగ్గింపు సిఫారసు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.