న్యూఢిల్లీ, జూన్ 25: జీఎస్టీ పరిహార సెస్సు విధింపు గడువును కేంద్ర ప్రభుత్వం మరో నాలుగేండ్లు పొడిగించింది. మార్చి 31, 2026 వరకు జీఎస్టీ పరిహార సెస్సు విధించనున్నారు. ఈ మేరకు వస్తు, సేవల పన్ను(పన్ను విధింపు, సెస్ వసూళ్ళు) మార్గదర్శకాలు, 2022ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. గతంలో విధించిన మార్గదర్శకాల ప్రకారం సెస్సు విధింపు ఈ నెల చివర్లో ముగియనున్నది. తాజాగా కేంద్రం ఈ గడువును జూలై 1, 2022 నుంచి మార్చి 31, 2026 వరకు పెంచింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ర్టాలకు పరిహారం చెల్లించడానికి గత రెండేండ్లుగా కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో రుణాలు తీసుకున్నదని, వీటిని పూడ్చుకోవడానికి ఈ సెస్సు విధింపు గడువును మరో నాలుగేండ్లు పెంచింది. మరోవైపు, జీఎస్టీ అమలు వల్ల రాష్ర్టాలు ఆదాయం కోల్పోయితే కేంద్ర ప్రభుత్వ పరిహార చెల్లింపుల గడువు మాత్రం ఈ నెల చివరేనని గతంలోనే మంత్రి స్పష్టంచేశారు.
గతేడాది సెప్టెంబర్లో జరిగిన 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, లగ్జరీ ఉత్పత్తులపై సెస్సును వచ్చే నాలుగేండ్లు విధించనున్నారు. జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతున్న ఆదాయాన్ని పూడ్చుకోవడానికి నరేంద్ర మోదీ సర్కార్ భారీ స్థాయిలో అప్పులు చేసింది. 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్ల మేర అప్పు చేసింది. వీటిపై వడ్డీ రూపంలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.7,500 కోట్లు చెల్లించగా, ఈసారి రూ.14 వేల కోట్లు చెల్లించనున్నది. 2023-24 నుంచి ఈ రుణాల చెల్లింపులు ప్రారంభించనున్నది. జూలై 1, 2017 నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీతో ఆదాయం కోల్పోయిన రాష్ర్టాలకు కేంద్రం ఐదేండ్లపాటు తిరిగి చెల్లింపులు జరిపేలా గతంలో ఒప్పందం కుదిరింది.