న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ)లో వాటాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వ సిద్ధమయ్యింది. ఈ కంపెనీలో 25 శాతం వాటాను ఐపీవో ద్వారా అమ్మకానికి పెట్టనుంది. విక్రయ ప్రక్రియలో భాగంగా ఆఫర్ను నిర్వహించేందుకు మర్చెంట్ బ్యాంకర్లు/బుక్న్న్రింగ్ లీడ్ మేనేజర్ల (బీఆర్ఎల్ఎం) నుంచి సోమవారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) బిడ్స్ ఆహ్వానించింది. బిడ్స్ సమర్పించేందుకు చివరితేదీ ఏప్రిల్ 28కాగా, ప్రభుత్వం ముగ్గురు మర్చెంట్ బ్యాంకర్లను నియమించుకుంటుంది. ఆఫర్ జారీ సమయం, నియంత్రణా నిబంధనల పాటింపు, ఇన్వెస్టర్లలో ఆసక్తి కల్గించడానికి రోడ్షోలు నిర్వహించడం తదితర అంశాల్లో ఈ మర్చెంట్ బ్యాంకర్లు ప్రభుత్వానికి సహాయపడతారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఐఆర్ఈడీఏ రుణాలిస్తుంది. ఐపీవో ద్వారా ఈ సంస్థను స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేసేందుకు గత నెలలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.