HIL | మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మూసివేతకు ప్రయత్నాలు జరుగుతున్నాయా?.. అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. దాదాపు 70 ఏండ్ల చరిత్ర కలిగిన హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్ (హెచ్ఐఎల్)కు నష్టాల పేరుతో గుడ్బై చెప్పాలని మోదీ సర్కారు చూస్తున్నదిప్పుడు. ఇందుకు తగ్గట్టే లోక్సభలో ఓ అధికారిక ప్రకటన కూడా రావడం గమనార్హం. సంస్థకున్న మూడు ప్లాంట్లలో రెండింటిని మూసేసే యోచనలో ఉన్నట్టు సంబంధిత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, మార్చి 17: ప్రభుత్వ రంగ సంస్థల్ని వీలైతే అమ్మేయడం, కాకపోతే మూసేస్తున్న బీజేపీ సర్కారు.. మరో కంపెనీ ఉసురు తీసేందుకు సిద్ధమవుతున్నది. ఏకంగా 7 దశాబ్దాల చరిత్ర కలిగిన హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్ (హెచ్ఐఎల్) వంతు వచ్చిందిప్పుడు. కేరళ, పంజాబ్ రాష్ర్టాల్లో ఉన్న రెండు హెచ్ఐఎల్ ప్లాంట్లను మూసివేసే ఆలోచనలో ఉన్నామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా శుక్రవారం తెలిపారు. ‘హెచ్ఐఎల్కు చెందిన కేరళ, పంజాబ్ ప్లాంట్ల కార్యకలాపాలను ప్రభుత్వం నిలిపివేయాలని ప్రతిపాదిస్తున్నదా? అంటే.. అవును అనే చెప్తాం’ అని లోక్సభలో ఓ లిఖితపూర్వక సమాధానంగా ఖూబా స్పష్టం చేశారు. అంతేగాక ఈ ప్లాంట్లలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లోకి తీసుకుంటారా? అన్న ప్రశ్నకు ‘లేదు’ అని మంత్రి బదులివ్వడం గమనార్హం.
1954 మార్చిలో హెచ్ఐఎల్ను ప్రారంభించారు. దీనికి కేరళ, పంజాబ్లతోపాటు ముంబైకి సమీపంలోని రసయానిలోనూ ప్లాంట్లున్నాయి. మొత్తం ఈ మూడు ప్లాంట్లలో సుమారు 1,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయంతో వీరంతా రోడ్డునపడే దుస్థితి నెలకొంటున్నది. ఆదుకోవాల్సిన పాలకులే.. ఆపదల్ని తెచ్చిపెడుతున్నట్టున్నది. హెచ్ఐఎల్.. ప్రపంచంలోనే అతిపెద్ద డీడీటీ ఉత్పాదక సంస్థ. మలేరియా, బ్లాక్ఫీవర్ల నియంత్రణకు దీన్ని వాడుతారు.
డీడీటీ ఉత్పత్తిని ఆపేస్తే ప్లాంట్లను ఇతర ప్రత్యామ్నాయ అవసరాల కోసం వాడాలిగానీ.. మూసేస్తే ఎలా? అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి నష్టాల్లో నడుస్తుంటే.. సీడ్, ఎరువుల కార్యకలాపాల విస్తరణకు వాడుకోవచ్చు. సాంకేతికత, ఆధునికత లేమి కారణాలను చెప్తూ ప్లాంట్లను మూసివేయడం తగదని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం తలిస్తే ప్లాంట్లను పునర్వినియోగంలోకి తీసుకురాలేదా? అని ప్రశ్నిస్తున్నారు.