EV Batterry System : సాంకేతిక దిగ్గజ సంస్థలైన గూగుల్(Google), ఆపిల్(Apple)కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ (MeitY) నోటీసులు పంపింది. ఎలక్రానిక్ రిక్షాలు, వాహనాలకు సమస్యలు తెస్తూ.. వాటి పాలిట విలన్లా మారిన ‘ఏడు’ యాప్స్ను వెంటనే తొలగించాలని ఈ రెండు సంస్థలను కోరింది. ఈ-రిక్షాలు, ఎలక్ట్రానిక్ వాహనాల బ్యాటరీల పనితీరును దెబ్బతీస్తున్న ఈ యాప్స్ను తమ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి తీసేయాలని గూగుల్, యాపిల్ కంపెనీలకు విజ్ఞప్తి చేసింది.
ఈమధ్య ఎలక్ట్రానిక్ రిక్షాలు, ఈవీ వాహనాల వాడకం ఎక్కువైంది. అదే సమయంలో గూగుల్, యాపిల్కు సంబంధించిన యాప్స్ ఈవీ వాహనాల బ్యాటరీ వ్యవస్థను పనితీరును దెబ్బతీస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. దాంతో, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ గూగుల్, యాపిల్ సంస్థలకు నోటీసులు ఇచ్చింది.
Ministry of Electronics and Information Technology issued notice to Google Android and Apple iOS to remove 7 applications from their App Store for misuse of apps for shutting down batteries in e-rickshaws/vehicles. Apps like BAT-BMS, SMART BMS, LOSSIGY: Sources pic.twitter.com/X5N7opwgli
— ANI (@ANI) July 3, 2026
ఈవీ రిక్షాలు, ఈవీ వాహనాల బ్యాటరీలను అకస్మాత్తుగా ఆగిపోయేలా చేస్తున్న BAT-BMS, SMART BMS, LOSSIGY వంటి ఏడు యాప్స్ను వెంటనే తొలగించాలని నోటీసుల్లో పేర్కొంది. ఇటువంటి యాప్స్ సాయంతో ఈవీ వాహనదారుల ప్రమేయం, అనుమతి లేకుండానే వాహనాలను నిలిపివేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం.. తక్షణమే వీటిని తమ యాప్స్ స్టోర్, ఐఓఎస్ నుంచి తొలగించాలని కోరింది. అయితే.. ప్రభుత్వం నోటీసులపై గూగుల్, యాపిల్ సంస్థలు స్పందించాల్సి ఉంది.