న్యూఢిల్లీ, జూలై 2: దేశంలో 1 బిలియన్ డాలర్ల ఉత్పత్తి ప్రాజెక్ట్ను చైనా ఆటోమొబైల్ కంపెనీ గ్రేట్ వాల్ మోటర్స్ రద్దు చేసుకుని, ఇక్కడి ఆఫీస్ను సైతం మూసివేసింది. చైనా టాప్ ఆటో కంపెనీల్లో ఒకటైన గ్రేట్ వాల్ పుణె సమీపంలోని తలెగాన్ వద్దనున్న జనరల్ మోటర్స్ (జీఎం) ప్లాంట్ను టేకోవర్ చేయడం ద్వారా భారత్లో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు ఒక డీల్ను కూడా జీఎంతో కుదుర్చుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు లభించకపోవడంతో ప్రాజెక్ట్ ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.
తలెగాన్ సైట్ సంబంధించి తాము జీఎంతో కుదుర్చుకున్న విక్రయ ఒప్పందపు గడువు జూన్ 30తో ముగిసిందని, నిర్ణీతకాలంలో అనుమతులు లభించకపోవడంతో ఉభయపార్టీలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు గ్రేట్ వాల్ మోటర్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఒప్పందం గడువును ఆరు దఫాలు పెంచుకున్నప్పటికీ, జీఎం ప్లాంట్ను టేకోవర్ చేయలేకపోవడతో ఇండియాలో కార్యాలయాన్ని కూడా మూసివేసి, 2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో బ్రెజిల్లో ఇటీవల కొనుగోలు చేసిన ప్లాంట్పై దృష్టి మళ్లించాలని గ్రేట్ వాల్ నిర్ణయించింది. మరో చైనా వాహన కంపెనీ చాంగాన్ ఆటోమొబైల్ కూడా పెట్టుబడి ప్రతిపాదనలకు ప్రభుత్వ అనుమతులు లభించక, నిరుడు భారత్లో కార్యాలయాన్ని మూసివేసింది.