అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీరేట్లు పెంచనున్నట్టు చేసిన ప్రకటనతో బంగారం ధరల్లో ఆటుపోట్లు మొదలయ్యాయి. అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా పసిడి ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు రూ.48 వేల వద్ద కదలాడుతున్నాయి. ఈ క్రమంలో బంగారం కొనాలనుకుంటున్నవారు మరోసారి సందిగ్ధంలో పడ్డారు. ఇంకా తగ్గుతాయా? అనే సందేహాలున్నాయి.
ఇటీవల జరిగిన ఫెడరల్ రిజర్వ్ సమావేశం తర్వాత ఆర్థికాభివద్ధి రేటుతోపాటు ద్రవ్యోల్బణం అంచనాలు సవరించారు. గతంలో అంచనా వేసినట్టు 2025లో కాకుండా 2023లోనే వడ్డీరేట్లను పెంచాలనుకున్నట్టు ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ప్రకటించారు. దీంతో యూరప్, జపాన్ తదితర దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీరేట్లను పెంచే యోచనలో పడ్డాయి. వడ్డీరేట్లు పెరిగితే వర్ధమాన దేశాల నుంచి విదేశీ నిధులు అమెరికన్ మార్కెట్లలోకి తరలి వెళ్తాయి. తద్వారా డాలర్ మరింత బలపడుతుంది. దీంతో బంగారం ధరలు దేశీయంగా పెరుగుతాయి. బంగారంలో ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పెరుగుతుంది. వడ్డీరేట్లు తక్కువగా ఉండడం, ద్రవ్యోల్బణం పెరుగుతున్న కారణంగా బంగారంలో పెట్టుబడులే సురక్షితం, ఆకర్షణీయంగా సంస్థాగత ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఒకవేళ వడ్డీరేట్లు పెరిగి, ద్రవ్యోల్బణం తగ్గితే వాస్తవ రాబడులు ఇతర మదుపు సాధనాలపై పెరుగుతాయి. అప్పుడు బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.
మరి బంగారం ధర ఎలా?
బంగారం ధరలపై ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తప్పు. ఎందుకంటే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచాలనుకున్నట్టు ప్రకటించినా.. దానికి ఇంకా సమయం ఉంది. అలాగే ద్రవ్యోల్బణం పెరుగుదల కంటే వడ్డీరేట్ల పెరుగుదల చాలా తక్కువగా ఉంటుందని అంచనా. అందువల్ల వాస్తవ వడ్డీరేట్లు చాలా తక్కువ. కరోనా సంకటం కారణంగా ఇప్పటికే అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ఉద్దీపన ప్యాకేజీలతో భారీగా కరెన్సీని ముద్రించి లిక్విడిటీని పెంచాయి. ఐరోపా దేశాలతోపాటు జపాన్ కూడా మరికొన్ని ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా అసెట్ కొనుగోళ్లను కొనసాగించనున్నట్టు ప్రకటించింది. దీంతో ద్రవ్యోల్బణంలో తగ్గుదల ఉండే అవకాశం తక్కువ. ఫలితంగా బంగారం ధరలు తగ్గే అవకాశాలు అంతంత మాత్రమే. అలాగే డాలర్ బలపడితే రూపాయి బలహీనపడుతుంది. దీంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గుతాయనుకోవడం సాధ్యపడేది కాదు.