న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3 : గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం మళ్లీ ప్రియమైంది. వరుసగా ఆరు రోజుల్లో రూ.10 వేల వరకు తగ్గిన గోల్డ్ ధర గురువారం ఏకంగా రూ.3,400 ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు రివ్వున ఎగిశాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.3,400 ఎగబాకి రూ.1,59,500లకు చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.1.56 లక్షలుగా ఉన్నది. ఇటీవల కాలంలో రికార్డుస్థాయికి చేరుకున్న అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గుముఖం పట్టడం వల్లనే గోల్డ్, వెండి ధరలు పుంజుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసర్చ్ హెడ్ సౌమిల్ గాంధీ తెలిపారు. అమెరికాలో ప్రైవేట్ ఉద్యోగ గణాంకాల్లో వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో వచ్చే పరపతి సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలుండటం కూడా బంగారం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమన్నారు.
బంగారంతోపాటు వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.5 వేలు అధికమై రూ.2.40 లక్షలకు చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.2,35,500గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 55.76 డాలర్లు లేదా 1.27 శాతం ఎగబాకి 4,443.93 డాలర్లకు చేరుకోగా, వెండి 65.77 డాలర్లు పలికింది. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ధరలు నెల గరిష్ఠ స్థాయిని తాకాయి.