న్యూఢిల్లీ: భారతీయలు ప్రతియేటా పండుగల సీజన్లోనే ఎక్కువగా వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. సాధారణ రోజుల్లో కంటే పండుగల టైంలోనే చాలా ఎక్కువగా వాహనాల సేల్స్ జరుగుతుండటంతో ఆటోమొబైల్ సంస్థలు సైతం ఆనందడోలికల్లో సంబురాలు చేసుకుంటూ ఉంటాయి. కానీ ఈ దఫా అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. సొంత వాహనాలను కొనుగోలు చేయడానికి భారీ స్థాయిలో డిమాండ్ ఉన్నా, ప్రస్తుతం ప్రతికూల వాతావరణం నెలకొంది. బుక్ చేసుకున్న కారు కోసం కనీసం 45 రోజులు.. గరిష్ఠంగా ఏడు నెలలు వేచి ఉండాల్సి వస్తుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం కొన్ని మోడల్ కార్ల కోసం వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనన్నమాట..
బతుకమ్మ (నవరాత్రి ఉత్సవాలు), దీపావళి పండుగల టైంలోనే అత్యధికంగా కార్ల కొనుగోలుకు బుకింగ్స్ ఉంటాయి. ప్రస్తుతం తక్కువ వడ్డీరేట్లకు అందుబాటులో రుణాలను ఉన్నందున కొన్ని ఆటోమొబైల్ సంస్థలు కన్జూమర్లను ఆకర్షించడానికి ఉచిత బహుమతులు, డిస్కౌంట్లు, ఆకర్షణీయ ఫైనాన్సియల్ స్కీమ్లు అమలు చేయడం కూడా డిమాండ్కు, సరఫరాకు మధ్య గ్యాప్ ఏర్పడింది.
టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఆటోమొబైల్ సంస్థలూ దాన్ని తమ వెహికల్స్ తయారీలో వాడుతున్నాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మొదలు ప్రమాద హెచ్చరికలు, ఎయిర్ బ్యాగ్స్ తదితర ఫీచర్లు అందుబాటులోకి రావడానికి టెక్నాలజీ ప్రధాన కారణం. జీపీఎస్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి ఆయా కార్లు, వాహనాల్లో వాడే చిప్స్ కీలకంగా వ్యవహరిస్తాయి.
కానీ కరోనా వల్ల చిప్లు, సెమీ కండక్టర్లను తయారు చేసే కంపెనీలు మూతపడ్డాయి. వర్కింగ్ ఫ్రం హోం, లెర్నింగ్ ఫ్రం హోం కల్చర్ పెరగడంతో లాప్టాప్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్ వినియోగం పెరిగింది.
కరోనా నుంచి రక్షణకు సొంత వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. కరోనా వేళ బిట్కాయిన్లను తయారు చేయడానికి చిప్లు, సెమీ కండక్టర్లను వినియోగించారు. తత్ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చిప్ల కొరత ఏర్పడింది. వినియోగదారుల డిమాండ్, కార్ల సరఫరాకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది.
కార్ల కొనుగోలు దారులు ముందస్తుగా చేసుకున్న బుకింగ్స్ ప్రకారం కొన్ని మోడల్ కార్ల కోసం చాలా కాలం వేచి ఉండాల్సి వస్తోంది. కొన్ని మోడల్ కార్ల కోసం 45 రోజుల నుంచి ఏడు నెలల పాటు వేచి ఉండాల్సిందేనని చెబుతున్నాయి. ఇంకొన్ని మోడల్ కార్ల కోసం వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందేనని ఆటోమొబైల్ సంస్థల ప్రతినిధులు అంటున్నారు.