FPI Out Flows | ఫెడ్ రిజర్వు ఎఫెక్ట్ మన దేశీయ స్టాక్ మార్కెట్లపై గణనీయంగానే ప్రభావం చూపినట్లు కనిపిస్తున్నది. వరుసగా ఆరో నెల మార్చిలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) గత నెలలో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.41 వేల కోట్ల నిధులు ఉపసంహరించుకున్నారు. త్వరలో కీలక వడ్డీరేట్లను అమెరికా ఫెడ్ రిజర్వు పెంచనున్నదన్న సంకేతాలతోపాటు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కూడా ఎఫ్పీఐల ఉపసంహరణకు కారణంగా కనిపిస్తున్నది.
ముడి చమురు ధరలు పైపైకి దూసుకెళ్లడంతోపాటు నిత్యావసర వస్తువులు ధరలు భగ్గుమనే అవకాశాలు ఉండటంతో ఎఫ్పీఐల రాకపై అనిశ్చితి కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత నెలలో ఎఫ్పీఐలు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.41,123 కోట్ల విలువైన షేర్లకు విక్రయించారు. జనవరి, ఫిబ్రవరిలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. జనవరిలో రూ.33,303 కోట్లు, ఫిబ్రవరిలో రూ.35,592 కోట్ల నిధులను ఎఫ్పీఐలు ఉపసంహరించుకున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకు గత ఆరు నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.1.48 లక్షల కోట్ల నిధులు ఉపసంహరించుకున్నారు.
ఉద్దీపనలకు చెల్లుచీటి పలుకుతూ కీలక వడ్డీరేట్లను పెంచనున్నట్లు ఫెడ్ రిజర్వు సంకేతాలివ్వడం వల్లే విదేశీ ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించుకున్నారని అప్సైడ్ ఏఐ కో-ఫౌండర్ అతనూ అగర్వాల్ చెప్పారు. ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి మారకం విలువ పతనం, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తదితర కారణాల వల్ల ఇన్వెస్టర్లు భద్రతకు ప్రాధాన్యం ఇస్తారన్నారు. డెట్ మార్కెట్లో గత నెలలో రూ.5,632 కోట్ల నిధులను విదేశీ ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు.