న్యూయార్క్, జూలై 10: స్వశక్తితో ఎదిగిన 100 మంది అత్యంత సంపన్న అమెరికన్ మహిళల్లో నలుగురు భారతీయులకు చోటు దక్కింది. వీరిలో శీతల పానీయాల తయారీ సంస్థ పెప్సీకో మాజీ చైర్పర్సన్, సీఈవో ఇంద్రా నూయీ, కంప్యూటర్ నెట్వర్కింగ్ కంపెనీ అరిస్టా నెట్వర్క్స్ అధ్యక్షురాలు, సీఈవో జయశ్రీ ఉల్లాల్, ఐటీ కన్సల్టింగ్-ఔట్సోర్సింగ్ సంస్థ సింటే సహవ్యవస్థాపకురాలు నీర్జా సేథీ, క్లౌడ్ కంపెనీ కన్ఫ్లూయెంట్ సహవ్యవస్థాపకురాలు, మాజీ సీటీవో నేహా నర్ఖెడే ఉన్నారు.
ఈ నలుగురి సంపద 4.06 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తమ 9వ వార్షిక జాబితాలో ఫోర్బ్స్ పేర్కొన్నది. జాబితాలో 2.4 బిలియన్ డాలర్ల సంపదతో ఉల్లాల్ 15వ స్థానంలో ఉండగా, 990 మిలియన్ డాలర్లతో సేథీ 25వ స్థానంలో ఉన్నారు. 520 మిలియన్ డాలర్లతో నర్ఖెడే 50వ స్థానంలో, 350 మిలియన్ డాలర్లతో నూయీ 77వ స్థానంలో నిలిచారు.