న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: కూరగాయల ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత కొన్ని నెలలుగా శాంతించిన ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గత నెలలో ఏకంగా ఆహార ధరల సూచీ 5.48 శాతానికి ఎగబాకింది. ఫిబ్రవరి నెలలో నమోదైన 3.81 శాతంతో పోలిస్తే భారీగా పెరిగింది. మరోవైపు, గత నెలకుగాను టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 29 నెలల కనిష్ఠ స్థాయి 1.34 శాతానికి పడిపోయినప్పటికీ ఆహార ధరల సూచీ మాత్రం భారీగా పెరగడం విశేషం. తయారీ రంగ ఉత్పత్తులు, చమురు ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా 10 నెలలోనూ ధరల సూచీ తగ్గుముఖం పట్టడం విశేషం. ఏడాది క్రితం 14.63 శాతంగా ఉన్న ధరల సూచీ ఫిబ్రవరిలో 3.85 శాతంగా నమోదైంది. మెటల్స్, టెక్స్టైల్స్, ఆహారేతర ఉత్పత్తులు, మినరల్స్, రబ్బర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు, పేపర్, పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్లనే టోకు ధరల సూచీ రెండున్నరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.