GST Council Meet | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ నెల 17న జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం జరుగనున్నది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సమావేశం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శనివారం ట్వీట్ చేసింది. కోవిడ్-19 నియంత్రణకు ఉపయోగించే ఔషధాలు, యంత్రాలు, పరికరాలపై పన్ను తగ్గింపుతోపాటు ఇతర అంశాలను చర్చించే అవకాశం ఉందని తెలుస్తున్నది.
ఇంతకుముందు జూన్ 12న జీఎస్టీ కౌన్సిల్ 44వ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో కోవిడ్-19 నియంత్రణకు వాడే ఔషధాలు, యంత్రాలు, ఇతర పరికరాలపై పన్నులో రాయితీలు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరు వరకు మాత్రమే గత కౌన్సిల్ సమావేశం నిర్ణయాలు అమలవుతాయి.
రెమ్డెసివిర్, తోకిలిజుమాబ్ వంటి ఔషధాలపై జీఎస్టీ తగ్గించారు. ఇంకా మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర కోవిడ్-19 అత్యవసరాలపై పన్నులో రాయితీ కల్పిస్తూ గత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకున్నది. ఈ దఫా జరిగే సమావేశంలో కోవిడ్ ఔషధాలు, ఇతర అత్యవసరాలపై పన్ను రాయితీపై సమీక్షిస్తారని తెలుస్తున్నది. రాష్ట్రాలకు ఆదాయ పరిహారంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.