ముంబై, ఆగస్టు 23: రేవులు-విమానాశ్రయాలు-విద్యుత్-సిమెంట్ తదితర రంగాల్లో విస్తరిస్తున్న అదానీ గ్రూప్ విపరీతంగా అప్పులు చేసిందని, దీంతో ఇది రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ గ్రూప్ యూనిట్ క్రెడిట్సైట్స్ హెచ్చరించింది. ఎడాపెడా తీసుకున్న రుణాల్నే ప్రస్తుత, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి చేస్తున్నదంటూ ‘అదానీ గ్రూప్-డీప్లీ ఓవర్లివరేజ్డ్’ పేరుతో క్రెడిట్సైట్స్ మంగళవారం విడుదల చేసిన రిపోర్ట్లో పేర్కొంది. అధిక రాబడుల్ని ఆశించి, రుణ పెట్టుబడులతో చేపట్టిన వృద్ధి ప్రణాళికలు.. పరిస్థితులు ప్రతికూలిస్తే రుణ ఊబిలోకి దించుతాయని, ఒకట్రెండు గ్రూప్ కంపెనీలు దివాలా తీసే అవకాశం ఉంటుందంటూ ఫిచ్ గ్రూప్ తీవ్ర హెచ్చరికను జారీచేసింది.
కమోడిటీస్ ట్రేడింగ్తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన గౌతమ్ అదానీ గ్రూప్ క్రమేపీ గనులు, రేవులు, విద్యుత్ ప్లాంట్లు, ఎయిర్పోర్ట్లు, డాటా సెంటర్లు, రక్షణ ఉత్పత్తుల తయారీ రంగాల్లోకి ప్రవేశించింది. ఇటీవలే అంబాజా సిమెంట్, ఏసీసీలను అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజం హోల్సిమ్ నుంచి 10.5 బిలియన్ డాలర్ల టేకోవర్తో ఈ రంగంలో అడుగిడింది. అలాగే అల్యూమినా తయారీకి సైతం సిద్దమయ్యింది. ఈ రంగాల్లో జరిపిన కొనుగోళ్లు, విస్తరణలూ చాలావరకూ రుణ సమీకరణ ద్వారానే అదానీ గ్రూప్ చేపట్టింది. కొద్ది ఏండ్లుగా అదానీ అమలు చేస్తున్న భారీ విస్తరణ కారణంగా ఆ గ్రూప్ రుణ పరపతి, నగదు నిల్వలపై ఒత్తిడి పడిందని క్రెడిట్సైట్స్ వివరించింది.
అదానీ గ్రూప్ చాలావరకూ తన ప్రధాన కార్యకలాపాలతో సంబంధం లేని వ్యాపారాల్లోకి లేదా కొత్తవాటిలోకి ప్రవేశిస్తున్నదని, పైగా వాటికి భారీ పెట్టుబడులు అవసరం ఉంటుందని, దీంతో ఆయా ప్రాజెక్టుల అమలుపై ఆందోళన తలెత్తుతున్నదని క్రెడిట్సైట్స్ పేర్కొంది. గ్రూప్ కార్పొరేట్ గవర్నెన్స్ స్థాయి అంతంతమాత్రంగానే ఉందని, ఎన్విరాన్మెంట్, సోషల్, గవర్నెన్స్ (ఈఎస్జీ) ప్రమాణాల్లో కూడా అదానీ రిస్క్ల్లో పడుతున్నదని తెలిపింది. రాగి రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, టెలికం, అల్యూమినా ఉత్పత్తి తదితరాల్లో అదానీ గ్రూప్నకు అనుభవం లేదని విమర్శించింది. పైగా ఈ వ్యాపారాల్లో కొద్ది ఏండ్లపాటు లాభాలు రావని, దీంతో వీటికి తీసుకున్న రుణాల్ని అదానీ గ్రూప్ తక్షణమే చెల్లించలేదని తెలిపింది. అందుచేత ఈ రుణాల్ని రీఫైనాన్స్ చేయాలంటే క్యాపిటల్ మార్కెట్ పరిస్థితులు, స్థానిక బ్యాంకింగ్ సంబంధాలు బాగుండాలని ఫిచ్ గ్రూప్ పేర్కొంది.
భారత స్టాక్ ఎక్సేంజీల్లో అదానీ గ్రూప్నకు ఆరు లిస్టెడ్ కంపెనీలున్నాయి. ఈ లిస్టెడ్ కంపెనీల స్థూల రుణం 2022 మార్చినాటికి రూ. 2.31 లక్షల కోట్ల మేర ఉన్నదని ఫిచ్ యూనిట్ వెల్లడించింది. వీటి వద్దనున్న నగదు నిల్వలను మినహాయిస్తే రూ.1.73 లక్షల కోట్ల వరకూ నికర రుణం ఉంది. భారీ రుణాలతోనే పెట్టుబడులు పెడుతున్నందున, అదానీ గ్రూప్ పట్ల ఆందోళన పెరుగుతున్నదని, దీని విస్తరణను సునిశితంగా గమనిస్తున్నామని క్రెడిట్సైట్స్ వివరించింది. అదానీ శరవేగంగా జరుపుతున్న విస్తరణ, అధిక రుణ స్థాయిల పట్ల తామే కాకుండా పలువురు గ్రూప్ ఖాతాదారులు, ఇన్వెస్టర్లలో సైతం ఆందోళన పెరుగుతున్నదన్నది. ఇలా రుణాలు పెరుగుతున్నందున, బాండ్లు జారీచేస్తున్న గ్రూప్ సంస్థల పరపతిపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఒక కంపెనీ విఫలమైతే అది మొత్తం గ్రూప్నకు వ్యాపిస్తుందని హెచ్చరించింది.