Debt Mutual Funds | మ్యూచువల్ ఫండ్స్.. ప్రత్యేకించి డెట్ మ్యూచువల్ ఫండ్స్(Debt Mutual Funds) ఇన్వెస్టర్లకు కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. ఈ డెట్ ఫండ్స్ లో పెట్టుబడులపై లాంగ్టర్మ్ క్యాపిటల్ గెయిన్ (ఎల్టీసీజీ) టాక్స్ మినహాయింపు ఎత్తివేస్తూ.. ఇన్ కం టాక్స్ చట్టానికి ఆర్థిక బిల్లు-2023 ద్వారా సవరణ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఆదాయం పన్ను మినహాయింపు కోసం డెట్ మ్యూచువల్ ఫండ్స్ (Debt Mutual Funds)లో పెట్టుబడులు పెట్టిన వారంతా వీటిల్లో వచ్చే ఆదాయంపై ఇన్కం టాక్స్ శ్లాబ్స్ ప్రకారం పన్ను పే చేయాల్సిందే.
సంపాదించిన ఆదాయంలో కొంత మేర పొదుపు చేద్దామని భావించే వేతన జీవులపై కేంద్రం భారం మోపింది. కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు ప్రత్యేకించి వేతన జీవుల ఆదాయంపై పన్ను వసూళ్లు పెంచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే నూతన పన్ను (New Tax Regime) విధానాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం.. పాత పన్ను విధానం (Old Tax Regime) కింద పన్ను రాయితీలను క్రమంగా ఎత్తేసే ఆలోచనలో ఉందని తెలుస్తున్నది.
ఇక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల్లో 35 శాతం ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయని ఫండ్స్ను డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఇటువంటి ఫండ్స్లో పెట్టుబడులపై ఎల్టీసీజీ మినహాయింపు క్లయిమ్ చేయడం కుదరదు. మూడేండ్ల కంటే ఎక్కువ కాలం డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పొదుపు చేసిన పెట్టుబడులను లాంగ్టర్మ్ క్యాపిటల్స్గా భావిస్తున్నారు.
ఈ ఫండ్స్లో పెట్టుబడులపై ఇండికేషన్తోపాటు 20 శాతం ఎల్టీసీజీ పే చేయాలి. ఇండికేషన్ లేకుండా అయితే 10 శాతం పన్ను పే చేస్తే సరిపోతుంది. కానీ ఇక నుంచి ఈ ఫండ్స్లో ఇన్వెస్టర్లంతా తమకు వచ్చే ఆదాయంపై ఇన్కం టాక్స్ శ్లాబ్ ఆధారంగా పన్ను పే చేయాల్సిందే. దీనివల్ల ఈక్విటీ మార్కెట్ లింక్డ్ డిబెంచర్లు, డెట్ మ్యూచువల్ ఫండ్స్పై విధించే పన్నులు సమానం అవుతాయి.
ఎల్సీటీజీ బెనిఫిట్ కల్పించడం వల్లే దేశంలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ (Debt Mutual Funds)కి ఆదరణ ఎక్కువైంది. ఇప్పుడు దాన్ని ఎత్తేయడంతో డెట్ మ్యూచువల్ ఫండ్స్కి ప్రాధాన్యం తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. బ్యాంకు డిపాజిట్లు పెంచడానికి కూడా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను నిరుత్సాహపర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఆర్థిక బిల్లు-2023కి పార్లమెంట్ ఆమోదం తర్వాత స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల స్టాక్స్ నష్టాల పాలయ్యాయి.