ముంబై, నవంబర్ 19: ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. విదేశాల్లో దేశీయ ఆభరణాలకు డిమాండ్ పడిపోవడంతో గత నెలలో ఎగుమతులు 14.64 శాతం తగ్గి రూ.25,843.84 కోట్లకు పడిపోయినట్లు జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) తెలిపింది. అక్టోబర్ 2021లో రూ.30,274.64 కోట్ల విలువైన ఆభరణాలు ఎగుమతి అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆభరణాల ఎగుమతులు అంచనాలకుమించి నమోదైనప్పటికీ గత నెలలో మాత్రం తగ్గుముఖం పట్టాయని జీజేఈపీసీ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత నెలల్లో తయారీ కార్యకలాపాలు పరిమితంగా ఉండటం, దీపావళి పండుగ సందర్భంగా కొన్నిరోజులు యూనిట్లు మూతపడటం కూడా ఎగుమతులపై ప్రభావం చూపాయని జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా తెలిపారు.