ముంబై, ఏప్రిల్ 17: బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులను మీరు సక్రమంగా తీర్చలేకపోయారా? అయినప్పటికీ మీరు మరిన్ని రుణాలను తీసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) సవరించి దాని పరిధిని పొడిగించింది. కొవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో 60 రోజులకు మించి పాత బాకీలు లేనివారికి లబ్ధి చేకూరుతుంది. అయితే ఈ సదుపాయం అందరికీ అందుబాటులో ఉండదు. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ కేవీ కామత్ నేతృత్వంలోని కమిటీ గుర్తించిన 26 సంక్షుభిత రంగాలకు చెందిన వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆర్థిక సేవల విభాగం స్పష్టం చేసింది.
ఈ జాబితాలో ఆరోగ్య సంరక్షణ, విమానయాన, విద్యుత్, సిమెంట్, నిర్మాణ, జౌళి రంగాలు మొదలుకొని కార్పొరేట్ రిటైల్ ఔట్లెట్ల వరకు వివిధ రంగాలున్నాయి. దీంతో రూ.50 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు పాత రుణాలున్న ఈ రంగాల్లోనివారంతా ప్రత్యేక రుణ సదుపాయాన్ని పొందవచ్చు. కొవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభణ వల్ల దేశంలోని పలు నగరాలు మళ్లీ లాక్డౌన్ దిశగా పయనిస్తున్నందున ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ద్రవ్య లభ్యతకు సంబంధించిన సతమతమవుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈసీఎల్జీఎస్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.