న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో గత మే నెలలో 9.20 లక్షల మంది నికర సబ్స్క్రైబర్లు జత కలిశారు. వీరిలో 5.73 లక్షల మంది ఖాతాదారులు చేరారు. ఇంత భారీ సంఖ్యలో సబ్స్క్రైబర్లు ఒక నెలలో చేరడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) తొలి రెండు నెలల్లో ఈపీఎఫ్వోలో చేరిన సబ్స్క్రైబర్ల సంఖ్య మొత్తం 20.20 లక్షల మందికి చేరింది.
కరోనా తొలి వేవ్తో పోలిస్తే రెండో వేవ్ ప్రభావం అంతగా లేదని, దీనికి తమ సంస్థలో కొత్త సబ్స్క్రైబర్లు భారీగా చేరడమే నిదర్శనం అని ఈపీఎఫ్వో ఓ ప్రకటనలో తెలిపింది. ఈపీఎఫ్వో సభ్యులకు సకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏబీఆర్వై, పీఎంజీకేవై స్కీమ్ల మద్దతు లభించడం కూడా ఒక కారణం.
మే నెలలో 3.47 లక్షల మంది నికర సబ్స్క్రైబర్లు వైదొలిగారు. తిరిగి ఇతర సంస్థల్లో ఉద్యోగాల్లో చేరిన సభ్యులు ఈపీఎఫ్వో సభ్యులు తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. మే నెలలో 22-25 ఏండ్ల మధ్య వయస్కులు సుమారు 2.39 లక్సల మంది ఈపీఎఫ్వోలో చేరారు. 29-35 ఏండ్ల మధ్య వయస్సు గల వారు 1.90 లక్షల మంది జత కలిశారు.
మొత్తం ఈపీఎఫ్వో సబ్స్క్రైబర్లలో మహిళలు సుమారుగా 21.77 శాతం పెరిగారు. హర్యానా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 5.45 లక్షల మంది ఖాతాదారులు చేరారు. మొత్తం సభ్యుల్లో ఇది 59.29 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు రాష్ట్రాల నుంచి 20.20 లక్షల మందికి గాను, 11.83 లక్షల మంది ఉన్నారని ఈపీఎఫ్వో వెల్లడించింది.
మొత్తం సబ్స్క్రైబర్లలో 46.77 శాతం మంది చిన్న కాంట్రాక్టర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, మ్యాన్ పవర్ ఏజెన్సీలతో కూడిన ఎక్స్పర్ట్ సర్వీసెస్ విభాగం వారే కావడం గమనార్హం.