ఫిబ్రవరిలో 25 శాతం అధికం
న్యూఢిల్లీ, మార్చి 15: దేశీయ ఎగుమతులు మళ్లీ జోష్ అందుకున్నాయి. కరోనాతో గత కొన్ని నెలలుగా నిరుత్సాహక పనితీరు కనబరుస్తున్న ఎగుమతులు గత నెలకుగాను ఏకంగా రెండంకెల వృద్ధి నమోదైంది. ఫిబ్రవరి నెలలో 34.57 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతులతో పోలిస్తే ఇది 25.1 శాతం అధికం. ఇదే నెలలో దేశీయ దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 36 శాతం ఎగబాకి 55.45 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్యలోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 20.55 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. దేశీయ దిగుమతుల్లో పెట్రోలియం, క్రూడాయిల్ వాటా 69 శాతం(15.28 బిలియన్ డాలర్లు)గా ఉండటం నరేంద్ర మోదీ సర్కార్ను కలవరానికి గురి చేస్తున్నది. గత నెలలో భారత్లోకి 4.8 బిలియన్ డాలర్ల విలువైన బంగారం వచ్చిచేరింది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో 374.81 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవగా, ఇదే సమయంలో 550.56 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది. దీంతో వాణిజ్యలోటు 175.75 బిలియన్ డాలర్లుగా ఉన్నది.