Sensex | ముంబై, జూలై 17: వరుస లాభాల్లో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 529.03 పాయిం ట్లు లేదా 0.80 శాతం ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా 66,589.93 వద్దకు చేరింది. ఒకానొక దశలో సూచీ 595.31 పాయింట్లు పుంజుకోవడంతో తొలిసారి 66, 656.20 స్థాయిని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 146.95 పాయింట్లు లేదా 0.75 శాతం ఎగబాకి ఆల్టైమ్ హై 19,711.45 వద్ద నిలిచింది. ఇక ట్రేడింగ్ మధ్యలో సూచీ 167.35 పాయింట్లు అందుకోవడంతో మొదటిసారి 19,731.85 స్థాయికి వెళ్లింది. కాగా, ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చాలా భారతీయ సంస్థలు అంచనాలకు తగ్గట్టుగా ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తుండటం.. ర్యాలీకి దోహదం చేస్తున్నదని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులతో సంబంధం లేకుండా మదుపరులు పెట్టుబడులకు ముందుకొస్తున్నారని చెప్తున్నారు.
మెరిసిన బ్యాంకింగ్ షేర్లు
బ్యాంకింగ్ సూచీ అత్యధికంగా 1.45 శాతం పెరిగింది. అలాగే ఆర్థిక సేవలు 1.11 శాతం, హెల్త్కేర్ 0.81 శాతం, కమోడిటీస్ 0.72 శాతం, ఎనర్జీ 0.62 శాతం, చమురు-గ్యాస్ రంగాల సూచీలు 0.38 శాతం మేర లాభపడ్డాయి. ఎస్బీఐ షేర్ విలువ గరిష్ఠంగా 2.82 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2 శాతం చొప్పున పుంజుకున్నాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ 0.85 శాతం, మిడ్క్యాప్ సూచీ 0.29 శాతం పెరిగాయి.
303.59 లక్షల కోట్లకు..
మదుపరులు కొనుగోళ్ల జోష్లో పరుగులు పెడుతుండటంతో బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఆల్టైమ్ హైని తాకుతూ రూ.3,03,59,528.96 కోట్లకు చేరింది. ప్రధాన ఆసియా, ఐరోపా మార్కెట్లతోపాటు అమెరికా మార్కెట్లు ఆశాజనకంగా లేకున్నప్పటికీ విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి భారతీయ మార్కెట్లలోకి పెట్టుబడులు కొనసాగుతున్నాయని ట్రేడర్లు చెప్తున్నారు.