బెంగళూరు, ఆగస్టు 26: దేశీయ ప్రధాన ఐటీ సంస్థలు ఉద్యోగుల బోనస్కు కోతలు పెడుతున్నాయి. మరికొన్ని మొత్తానికే పక్కనపెడుతున్నాయి. అమెరికా, ఐరోపా క్లయింట్ల నుంచి పడిపోతున్న ఆదాయం నేపథ్యంలో వ్యయ నియంత్రణ దిశగా భారతీయ ఐటీ రంగం అడుగులు వేస్తున్నది. ఇన్ఫోసిస్తోపాటు విప్రో కంపెనీలు జీతాల్లో భాగమైన వేరియబుల్ పే తగ్గించినట్టు తమ ఉద్యోగులకు ఇప్పటికే సందేశాలు ఇవ్వడం గమనార్హం. నిజానికి క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్సెక్యూరిటీ, క్రిప్టోకరెన్సీ లావాదేవీల వంటి వాటికి అంతటా డిమాండ్ పెరగడంతో గడిచిన రెండేండ్లుగా ప్రతిభ, నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఒడిసి పట్టుకునేందుకు పెద్ద మొత్తాల్లో ఐటీ సంస్థలు జీతాలిస్తూ వచ్చాయి. ఇప్పుడిదే సమస్యగా మారిందన్న భావన సంస్థల్లో కనిపిస్తున్నది.
దేశీయ ఐటీ కంపెనీలకు ప్రధానంగా ఆదాయం విదేశీ ప్రాజెక్టుల నుంచే వస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ ప్రభావం కంపెనీల లాభాలపై స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్లో ఇన్ఫోసిస్ నిర్వహణ లాభం 3.6 శాతానికి పతనమైంది. నిరుడు 20.1 శాతంగా ఉన్నది. విప్రో ఐటీ సేవల లాభం కూడా 18.8 శాతం నుంచి 15 శాతానికి దిగింది. ఈ క్రమంలోనే వ్యయ నియంత్రణపై సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే ఉద్యోగులను పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నాయి. లేనిపక్షంలో వేరియబుల్ పే కోత తప్పదని ఇన్ఫోసిస్ హెచ్చరించింది. విప్రో సైతం లాభాలు తగ్గాయని వేరియబుల్ పే 30 శాతం తగ్గించింది.
ప్రపంచ మాంద్యానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నదని గ్లోబల్ ఐటీ సంస్థలపై రిసెర్చ్లు చేసే అమెరికా ఆధారిత కన్సల్టెన్సీ ఎవరెస్ట్ గ్రూప్ సీఈవో సామ్యూల్ అంటున్నారు. ఇదే జరిగితే దేశీయ ఐటీ సంస్థలు మరింత కష్టాల్లోకి జారుకున్నట్టే. అయితే మాంద్యం ముప్పును ముందుగా గుర్తించే ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయా?.. అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
కొత్త నియామకాల జోలికి కూడా కంపెనీలు వెళ్లడం లేదు. అత్యవసరమైతే తప్ప ఉద్యోగాల్లోకి ఎవర్నీ తీసుకోవడం లేదు. పైగా ఉన్న ఉద్యోగులనూ వడపోత పట్టే ఆలోచనలున్నాయి. దీంతో ఉద్యోగులు పోయే అవకాశాలూ ఉన్నాయన్న అభిప్రాయాలు పరిశ్రమ నుంచి వినిపిస్తున్నాయి. అయితే దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్ మాత్రం తమ ఉద్యోగుల వేరియబుల్ పే తగ్గించడం లేదని స్పష్టం చేసింది. అందరికీ సకాలంలోనే ఇచ్చామంటున్నది.