దేశంలో ఉన్న రకరకాల బ్యాంకులు..భారతీయ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు అద్దం పడుతాయి. దేశ ఎకానమీలో బ్యాంకులదే కీలకపాత్ర. నగదు డిపాజిట్లను తీసుకోవడానికి, రుణాలు ఇవ్వడానికి వీటికి లైసెన్స్ ఉంటుంది. ఇలా బ్యాంకులు దేశ ప్రగతికి, అభివృద్ధికి, ఆర్థిక సుస్థిరతకు, నూతన వ్యాపారాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. మన దేశంలో ఈ బ్యాంకింగ్ వ్యవస్థను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియంత్రిస్తున్నది.
Bank | ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిత్యం మనం బ్యాంకులపై ఆధారపడుతూనే ఉంటాం. మన దగ్గరున్న నగదును డిపాజిట్ల రూపంలో తీసుకునే బ్యాంకులు.. మన అవసరాల కోసం రుణాలనూ అందిస్తాయి. సేవింగ్స్, కరెంట్ ఖాతాల్లో నగదును దాచుకోవచ్చు. ఉద్యోగులకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లుంటున్నాయి. బంగారం, ఇతర విలువైన నగలు, పత్రాలను లాకర్లలో భద్రపర్చుకోవచ్చు. సురక్షితమైన డిపాజిట్లకు వీలుంటుంది. వీటిపై వడ్డీని కూడా పొందవచ్చు. తక్కువ వడ్డీరేటుకే వ్యక్తిగత, గృహ, వాహన, వ్యాపార, విద్య, గోల్డ్ తదితర రుణాలనూ అందిస్తాయి. ముఖ్యంగా ఏటీఎంల ద్వారా నిరంతరం నగదును అందుబాటులో ఉంచుతాయి. డెబిట్, క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి. మరెన్నో లావాదేవీలు జరుపుతుంటాయి. ఫారిన్ ఎక్సేంజ్తో డీల్స్, వ్యవస్థలో ద్రవ్య సరఫరా, నియంత్రణ బాధ్యతలుంటాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారతీయ కేంద్ర బ్యాంకే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షించడం, రెపో-రివర్స్ రెపో వడ్డీరేట్లను సవరిస్తూ నియంత్రించడం, తగు మార్గదర్శకాలను రూపొందించడం ఆర్బీఐ ప్రధాన విధులు. కొత్త బ్యాంకులకు లైసెన్సులు మంజూరు చేయడం, నిబంధనల్ని ఉల్లంఘించిన వాటిపై చర్యలు తీసుకోవడం కూడా ఆర్బీఐ చేస్తుంది. ప్రతీ రెండు నెలలకోసారి ద్రవ్యపరపతి విధాన సమీక్షల్ని చేపట్టి వివిధ సాధనాల ద్వారా బ్యాంకింగ్ సిస్టమ్లోని నగదు సరఫరాను క్రమబద్ధీకరిస్తుంది. ఇక బ్యాంకుల్లో ఏయే రకాలున్నాయంటే..
షెడ్యూల్డ్ బ్యాంకులు
కమర్షియల్ బ్యాంకులే షెడ్యూల్డ్ బ్యాంకులు. ఇవి ఆర్బీఐ నియంత్రణలో పనిచేస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని రెండో షెడ్యూల్లో వీటి ప్రస్తావన ఉన్నది. ఇక షెడ్యూల్డ్ బ్యాంకులను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు. డిపాజిట్లను సేకరించడం, రుణాలను ఇవ్వడంతోపాటు ఖాతాల ద్వారా వివిధ రకాల సేవల్ని అందిస్తాయి. ఇందుకు చార్జీలనూ వసూలు చేస్తాయి. విస్తృత శ్రేణిలో ఆర్థిక సేవలు, కార్పొరేట్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్ సర్వీసుల్ని కల్పిస్తాయి. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులే కీలకం.
నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు
నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు ఆర్బీఐ నియంత్రణలో ఉండవు. సాధారణంగా ఇవి చిన్న బ్యాంకులు. రిజర్వ్ క్యాపిటల్ రూ.5 లక్షలలోపే ఉంటుంది. వ్యక్తులు, వ్యాపార సంస్థలకు రుణాలను అందిస్తాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ది తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, హిందుస్థాన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తదితర ఎన్నో నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ) 1975లో ఏర్పాటయ్యాయి. గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను అందించాలనే లక్ష్యంతో ఇవి పనిచేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎస్బీఐ తదితర కమర్షియల్ బ్యాంకులు వీటికి స్పాన్సరర్లుగా వ్యవహరిస్తుంటాయి. గ్రామీణాభివృద్ధిలో వీటి పాత్ర ఎంతో కీలకం. ప్రస్తుతం దేశంలో 43 ఆర్ఆర్బీలున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంకులూ ఉన్నాయి.
సహకార బ్యాంకులు
వీటిలో ప్రధానంగా పట్టణ, గ్రామీణ సహకార (కోఆపరేటివ్) బ్యాంకులున్నాయి. ఆర్థిక సేవల శాఖ వివరాల ప్రకారం దేశంలో 1,886 సహకార బ్యాంకులున్నాయి. 1,500 అర్బన్, 386 రూరల్ కోఆపరేటివ్ బ్యాంకులు. రూరల్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో 34 రాష్ట్ర సహకార బ్యాంకులు, 352 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు. సేవింగ్స్ ఖాతాలు, ముఖ్యంగా వ్యవసాయ రుణాలను అందిస్తున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో వీటిది విడదీయరాని బంధమే.
లోకల్ ఏరియా బ్యాంకులు
2013లో లోకల్ ఏరియా బ్యాంకులు వచ్చాయి. కమర్షియల్ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం వీటికి స్పాన్సరర్లుగా ఉంటాయి.
ఆర్థిక వ్యవస్థలో నిర్దేశిత రంగాలనుద్దేశించి ఈ బ్యాంకులు ఏర్పాటవుతాయి. వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల కోసమే ప్రత్యేకంగా వీటిని తీసుకొస్తారు. నాబార్డు, ఐడీబీఐ బ్యాంకులు ఈ కోవకు చెందినవే.
– అంకం సంతోష్
పేమెంట్స్ బ్యాంకులు
2015లో పేమెంట్స్ బ్యాంకులు మొదలయ్యాయి. ఇవి సేవింగ్స్ ఖాతాలు, నగదు బదిలీలు, బిల్ పేమెంట్లు వంటి కనీస బ్యాంకింగ్ సేవల్ని కస్టమర్లకు అందిస్తున్నాయి. అయితే రుణాలను మంజూరు చేయవు. క్రెడిట్ కార్డులనూ ఇవ్వవు. ప్రధానంగా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి వీటిని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం 6 పేమెంట్స్ బ్యాంకులున్నాయి. వీటిలో ఎయిర్టెల్, ఇండియా పోస్ట్, ఫినో, పేటీఎం, జియో, ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంకులున్నాయి. ఆర్బీఐ పర్యవేక్షణలోనే ఇవి పనిచేస్తాయి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు 2015 నుంచి ఆర్బీఐ లైసెన్సుల్ని ఇస్తున్నది. చిరు వ్యాపారులు, రైతులే లక్ష్యంగా వీటి బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రధానంగా సాగుతాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు, అసంఘటిత రంగ పరిశ్రమలకూ ఆర్థిక చేయూతనందిస్తాయి. సేవింగ్స్ ఖాతాలతోపాటు రుణాలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కస్టమర్లకు అందిస్తాయి. ప్రస్తుతం 12 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులున్నాయి. వాటిలో ఏయూ, ఈక్విటాస్, ఉజ్జీవన్ తదితర స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులున్నాయి.