Direct Tax Collections | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 48 శాతానికి పైగా పెరిగాయి. అడ్వాన్స్ పన్ను చెల్లింపులు 41 శాతం ఎక్కువైంది. కరోనా సెకండ్ అండ్ థర్డ్ వేవ్ల నుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకున్నది. ఫలితంగా వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయ పన్ను వసూళ్లు పెరిగాయి. గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 16 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.63 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ.9.18 లక్షల కోట్లు వసూలయ్యాయి.
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో వ్యక్తుల వ్యక్తిగత ఆదాయం, కార్పొరేట్ సంస్థల లాభాలపై పన్ను, ఆస్తి పన్ను, వారసత్వ పన్ను, గిఫ్ట్ టాక్స్ చెల్లింపులు పెరిగాయి. కరోనాకు ముందు 2019-20లో రూ.9.56 లక్షల కోట్లతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం ఎక్కువయ్యాయి. 2021-22లో చివరి త్రైమాసికం అడ్వాన్స్ పన్ను వసూళ్లు ఈ నెల 15 నాటికి రూ.6.62 లక్షల కోట్లు. గతేడాదితో పోలిస్తే రూ.40.75 కోట్లు.
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో షేర్లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ)తోపాటు వ్యక్తిగత ఆదాయం పన్ను 47 శాతం అయితే కార్పొరేట్ పన్ను వసూళ్లు 53 శాతంగా నమోదయ్యాయి. గతేడాది ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.11.08 లక్షల కోట్లు దాటుతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. గత నెల ఒకటో తేదీన వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.50 లక్షల కోట్లకు చేరతాయని అంచనాలు సవరించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రత్యక్ష పన్ను వసూళ్లో కార్పొరేట్ టాక్స్ వసూళ్లు రూ.7,19,035 కోట్లు కాగా, వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు రూ.6,40,588.3 కోట్లు అని అధికార ప్రకటనలో కేంద్రం తెలిపింది.