Flipkart | బెంగళూరు, ఏప్రిల్ 8: డిజిటల్ కామర్స్ సేవల సంస్థ ఫ్లిప్కార్ట్..తాజాగా బస్ టెకెట్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఇందుకోసం సంస్థ రాష్ట్ర రవాణ కార్పొరేషన్లు, ప్రైవేట్ అగ్రిగేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ప్రస్తుతానికి బెంగళూరు, ఛండీగఢ్, ఢిల్లీ, జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, చెన్నైలలో ఈ టికెట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎలాంటి చార్జిలు లేకుండా బస్ టికెట్ను బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది. అలాగే ఈ నూతన సేవలు ప్రారంభ సందర్భంగా ఈ నెల 15 వరకు 20 శాతం వరకు రాయితీని కల్పించింది. దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా బస్సులకు సంబంధించిన టికెట్ బుకింగ్ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే విమాన టికెట్, హోటల్ బుకింగ్ సేవలను ఆరంభించిన విషయం తెలిసిందే.