హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఏరోస్పేస్ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం సత్తాచాటుతున్నది. విమానాల విడిభాగాలు, ఇంజిన్లు, హెలీక్యాప్టర్కు సంబంధించిన క్యాబిన్లు తయారవుతున్న హైదరాబాద్లో ప్యాసింజర్ విమానాలను కార్గో విమానాలుగా మార్పిడి చేసే కన్వర్షన్ లైన్ను బోయింగ్ ఏర్పాటు చేయబోతున్నది. జీఎమ్మార్తో కలిసి నెలకొల్పుతున్న ఈ కన్వర్షన్ లైన్ రెండేండ్లలో అందుబాటులోకి రాబోతుండటంతో రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగానికి మంచి ఊపు లభించినట్టు అయింది.
ప్రపంచంలోనే అతికొద్ది ప్రాంతాల్లో ఈ కన్వర్షన్ కార్యకలాపాలు సాగుతుండగా..తాజాగా ఈ జాబితాలోకి హైదరాబాద్ చేరినట్టు అయింది. భారత్లో కూడా తొలి కన్వర్షన్ లైన్ కావడం విశేషం. ఇప్పటికే శాఫ్రాన్, టాటా-బోయింగ్, జీఎమ్మార్ తదితర సంస్థలు ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్ వేదికగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
కన్వర్షన్ లైన్ ఏర్పాటు కోసం బోయింగ్ ఏడాది క్రితమే చర్యలు ప్రారంభించి..గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. దీనికి జీఎమ్మార్తోపాటు నాగపూర్, తిరువనంతపురంలోని ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఈఎస్ఎల్) సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. కాగా, మూడు ప్రాంతాల్లోని ఎంఆర్వోలను సందర్శించిన బోయింగ్ ప్రతినిధులు చివరికి హైదరాబాద్ను ఎంపికచేశారు.
నాగపూర్, తిరువనంతపురంలోని ఎంఆర్వోతో పోల్చుకుంటే హైదరాబాద్లోని జీఎమ్మార్ వద్ద మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన సిబ్బంది, ఇతర సౌకర్యాలు ఉన్నట్లు గుర్తించి ఈ టెండర్ను అప్పగించారు. దీంతో హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్ సంస్థ భాగస్వామ్యంతో కన్వర్షన్ లైన్ ఏర్పాటునకు మార్గం సుగమం అయింది. మరోవైపు, ప్రస్తుతం చిన్న బాడీ విమానాలనే కార్గోకు కన్వర్ట్ చేస్తున్న బోయింగ్.. రానున్న రోజుల్లో పెద్ద బాడీ విమానాలను కూడా ఇదే తరహాలో మార్పిడి చేసే వీలుందని వారు పేర్కొంటున్నారు.
ఎయిర్బస్ కూడా..
రానున్న రోజుల్లో బోయింగ్తోపాటు ఫ్రాన్స్కు చెందిన మరో దిగ్గజ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ కూడా ఇక్కడ కన్వర్షన్ కార్యకలాపాలు చేపట్టే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా విమానయాన రంగానికి సంబంధించి సమీప భవిష్యత్తులో హైదరాబాద్ ఓ ప్రధాన కేంద్రంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు.
‘తాజా ఒప్పందంతో ఎంఆర్వోలకు మద్దతును అందించడమే కాకుండా కార్గో రంగం సైతం శరవేగంగా ముందుకు సాగేందుకు తోడ్పాటునందించనున్నది.
– సలీల్ గుప్తా,బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్
కార్గోకు మొగ్గు చూపుతున్న సంస్థలు