Shaktikanta Das | రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాంకుల్లో నోట్ల డిపాజిట్తో పాటు మార్చుకునేందుకు మంగళవారం నుంచి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రక్రియపై బుధవారం స్పందించారు. ఆర్బీఐ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని, అంతరాయం కలుగకుండా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
రూ.2వేల కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఆర్బీఐ నాలుగు నెలల సమయం ఇచ్చిందన్నారు. నిన్న ఎక్కడా బ్యాంకుల వద్ద రద్దీ లేదని, పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నామన్నారు. పెద్దగా సమస్యలు వచ్చే అవకాశం లేదని భావిస్తున్నామన్నారు. వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయని తెలిపారు. నోట్లను మార్చుకునేందుకు సమయం ఎక్కువగానే ఇచ్చామని, దాంతో సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదన్నారు. ఇదిలా ఉండగా.. ఆర్బీఐ రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
మంగళవారం నుంచి ఒకేసారి రూ.20వేల వరకు రూ.2వేల కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు డిపాజిట్, నోట్ల మార్పిడికి గడువు విధించింది. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పలు ప్రశ్నలకు శక్తికాంత దాస్ స్పందిస్తూ.. అధిక విలువ కలిగిన కరెన్సీని ఉపసంహరించుకునే ప్రక్రియ.. ఎలాంటి అంతరాయం కలిగించదన్నారు. రూ.2వేల నోట్లు చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో దాదాపు రూ.3.6లక్షల కోట్లని, ఈ నోట్లు జీవిత చక్రాన్ని పూర్తి చేశాయని, వాటి ప్రయోజనం నెరవేరిందన్నారు.