Demat Account | ముంబై, సెప్టెంబర్ 25: డీమ్యాట్ ఖాతాలకు భలే డిమాండ్ కనిపిస్తున్నది. గత నెల ఆగస్టు ఆఖరుకల్లా ఖాతాల సంఖ్య 12.7 కోట్లకు చేరింది. నిరుడుతో పోల్చితే ఏకంగా 26 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం. గత ఏడాది ఆగస్టు చివరి నాటికి ఉన్న డీమ్యాట్ ఖాతాలు 10.1 కోట్లే. కాగా, గరిష్ఠంగా సీడీఎస్ఎల్లో 9.35 కోట్లు, ఎన్ఎస్డీఎల్లో 3.3 కోట్ల డీమ్యాట్ ఖాతాలున్నాయని సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తాజా గణాంకాలు చెప్తున్నాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి వస్తున్న ఆకర్షణీయ రాబడులతోపాటు డీమ్యాట్ ఖాతాలను తెరిచే ప్రక్రియ మునుపటి కంటే సులభతరం కావడం కూడా పెరుగుదలకు కారణమేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై పెరుగుతున్న ఆసక్తి, అవగాహనలతోపాటు ముఖ్యంగా ట్రేడింగ్పై యువ మదుపరుల్లో స్పష్టత సైతం డీమ్యాట్ ఖాతాల సంఖ్యను పెంచుతూపోతున్నట్టు చెప్తున్నారు. ఇదిలావుంటే ఈ ఆగస్టులో 31 లక్షల డీమ్యాట్ ఖాతాలు కొత్తగా తెరుచుకున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది.
అంతకుముందు నెల జూలైలో 30 లక్షల ఖాతాలు తెరిచారని పేర్కొన్నది. దీంతో 4.1 శాతం వృద్ధి కనిపించినట్టు వివరించింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్-ఆగస్టు మధ్య నెలవారీ కొత్త డీమ్యాట్ ఖాతాలు సగటున 21 లక్షలు తెరుచుకున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. మరోవైపు ఎన్ఎస్ఈ క్రియాశీల క్లయింట్ల సంఖ్య వరుసగా గత రెండు నెలలుగా పెరుగుతున్నది. ఆగస్టులో 3.27 కోట్లకు చేరుకున్నాయి. ఇక జెరోధా, ఏంజెల్ వన్, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ టాప్-5 డిస్కౌంట్ బ్రోకర్లుగా ఉన్నా యి. కాగా, సెబీ సూచనల ప్రకారం వ్యక్తిగత డీమ్యాట్ ఖాతాదారులంతా ఈ నెలాఖరుకల్లా వారి నామినీ వివరాలను జత చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఖాతా స్తంభించబడుతుందని, పెట్టుబడుల రిడీమ్కూ వీల్లేకుండా పోతుందని సెబీ హెచ్చరిస్తున్నది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులు, కొత్తవారికీ ఇది వర్తిస్తుంది.