Amazon-Future | గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆర్బిట్రేషన్ పిటిషన్ రద్దు చేయడానికి తగు ఆదేశాలు జారీ చేయాలని ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. రిలయన్స్తో ఒప్పందం విషయంలో ఫ్యూచర్ గ్రూప్ ముందుకెళ్లకుండా అమెజాన్ 2020లో దాఖలు చేసిన ఆర్బిట్రేషన్ పిటిషన్పై సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఎమర్జెన్సీ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్, (ఎఫ్సీఎఫ్ఎల్), ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు రిజర్వు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. వీటిపై తమ ఆదేశాలను హైకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని జస్టిస్ అమిత్ కుమార్ బన్సాల్ తెలిపారు.
అప్పులతో సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్స్ రిటైల్ 2020లో రూ.24,500 కోట్లకు రిలయన్స్రిటైల్లో విలీనానికి ఒప్పందం ఖరారు చేసుకున్నది. అంతకుముందే ఫ్యూచర్ కూపన్స్లో 49 శాతం వాటాను అమెజాన్కు విక్రయించిన ఫ్యూచర్ రిటైల్.. భవిష్యత్లో సంస్థను ఆ సంస్థకే విక్రయిస్తామన్న ఒప్పందంపై సంతకాలు చేసింది. కానీ రిలయన్స్కు విక్రయించాలని నిర్ణయం తీసుకోవడంతో ఫ్యూచర్స్-రిలయన్స్ డీల్కు వ్యతిరేకంగా సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో అమెజాన్ పిటిషన్ వేసింది. దీనిపై సింగపూర్ న్యాయస్థానం అత్యవసర ఆదేశాలు జారీ చేయడంతో ఆ డీల్ నిలిచిపోయింది.
ఫ్యూచర్ గ్రూప్తో అమెజాన్ రెండేండ్ల క్రితం చేసుకున్న ఒప్పందాన్ని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సస్పెండ్ చేసింది.. అమెజాన్పై రూ.202 కోట్ల పెనాల్టీ విధించింది. అమెజాన్ కుదుర్చుకున్న ఒప్పందం ఫ్రాడ్ అని ఫ్యూచర్ తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు.