Shaktikanta Das on Crypto | క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక వ్యవస్థలకు ముప్పు పొంచి ఉందని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. అధునాతన పేరుతో వదంతుల మధ్య క్రిప్టో కరెన్సీలు దూసుకెళ్తాయన్నారు. గురువారం ఆయన ఆర్బీఐ ఆర్థిక సుస్థిరత నివేదికను రిలీజ్ చేశారు. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు మదుపు చేయడం పట్ల ఆయన తరుచుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య క్రిప్టో కరెన్సీల విలువ భారీగా పడిపోతున్న నేపథ్యంలో శక్తికాంత దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
రోజురోజుకు ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ పెరిగిపోతున్నదని శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ పెరిగినా కొద్దీ సైబర్ ముప్పు పెరుగుతుందని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, అంతర్జాతీయ ఒడిదొడుకుల మధ్య ఆర్థిక వ్యవస్థ అదుపు తప్పుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో జాతీయ, అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వెతకాల్సి ఉందని చెప్పారు.