Financial Deadlines | చరిత్ర కాలగర్భంలో మరో సంవత్సరం కలిసిపోతున్నది. మరో 13 రోజుల్లో 2023 ముగిసి కొత్త వసంతంలోకి అడుగిడబోతున్న వేళ.. డిసెంబర్ 31 లోపు పలు ఫైనాన్సియల్ డాక్యుమెంట్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. కొన్ని పథకాలు, ఫోన్ నంబర్ల అప్డేట్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు చేర్పులూ ఈ నెల 31 అర్థ రాత్రి లోపు పూర్తి చేయాలి సుమా..! అవేమిటో ఓ లుక్కేద్దామా..!
ఈ నెల 31లోగా ప్రతి ఒక్కరూ ఉచితంగా తమ ఆధార్ ఎటువంటి మార్పులు లేకుండా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవడానికి విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) గడవు విధించింది. ఈ గడువు ముగిసిన తర్వాత ఈ ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు సెప్టెంబర్ 14 వరకు విధించిన గడువును ఉడాయ్ మళ్లీ పొడిగించింది.
వివిధ బ్యాంకుల్లో ఖాతాదారులు తమ ఆభరణాలు, ఆస్తుల పత్రాలను లాకర్లలో భద్ర పరుస్తుంటారు. ఆయా లాకర్లు తీసుకోవడానికి ఖాతాదారులు బ్యాంకులతో లాకర్ అగ్రిమెంట్లు కుదుర్చుకుంటారు. అలా ఖాతాదారులు తమ బ్యాంకులతో కుదుర్చుకున్న లాకర్ అగ్రిమెంట్లను ఈ నెల 31లోపు పునరుద్ధరించుకుని, ఆ పునరుద్ధరణ అగ్రిమెంట్ను సంబంధిత బ్యాంకు శాఖలో సమర్పించాలని ఆర్బీఐ ఆదేశించింది. బ్యాంకు లాకర్ల భద్రత, సర్వీసు నాణ్యత పెంపునకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది.
కొందరు తమ ఆదాయంలో కొంత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడతారు. మరి కొందరు స్టాక్స్లో పెట్టుబడుల కోసం డీమ్యాట్ ఖాతా తెరుస్తారు. అటువంటి వారు తమ నామినీల వివరాలు ఈ నెలాఖరులోపు అప్డేట్ చేసుకోవాలని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ `ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆదేశించింది. ఈ గడువు ముగిసిన తర్వాత ఎటువంటి కొత్త మార్పులు చేర్పులు ఉండబోవని స్పష్టం చేసింది. సజావుగా ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ చేయడానికి ఈ అప్డేట్ తప్పనిసరిగా పూర్తి చేయాలని తేల్చి చెప్పింది.
గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఐటీ రిటర్న్స్ను గత జూలై 31లోపు ఫైల్ చేయని వారు.. ఈ నెలాఖరు లోపు బీ లేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అందుకు ఆదాయం పన్ను చట్టం -1961 139 (4) సెక్షన్ ప్రకారం బీలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి అవకాశం ఇదే. బీ లేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేస్తున్న వారు రూ.5000 వరకూ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్ నంబర్లు తరుచుగా మారుస్తుంటారు. అలా మారుస్తున్నప్పుడు యూపీఐ ఐడీలు మరిచిపోతుంటారు. అలా మరిచిపోవడం వల్ల ఒక్కోసారి గుర్తు తెలియని వారికి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇటువంటి ఇబ్బందులకు తెర దించేందుకు ఏడాదికి పైగా ఇన్ యాక్టివ్గా ఉన్న యూపీఐ ఐడీలను ఈ నెలాఖరులోగా డీయాక్టివేట్ చేయాలని పేమెంట్స్ యాప్స్, బ్యాంకులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సూచించింది. ఫోన్ నంబర్లు మార్చుకున్న కస్టమర్లు తమ బ్యాంకుల్లో ఆ నంబర్లను అప్డేట్ చేయాలని సూచించింది. కస్టమర్లు తమ యూపీఐ ఐడీ ఇన్ యాక్టివ్ కావద్దని కోరుకుంటే.. గడువు లోపు ఒక లావాదేవీ అయినా చేయాలని ఎన్పీసీఐ సూచించింది.