న్యూఢిల్లీ, మార్చి 28: కీలక రంగాల్లో మళ్లీ నిస్తేజం నెలకొన్నది. ఎరువుల రంగంలో నెలకొన్న నిస్తేజం కారణంగా ఫిబ్రవరి నెలలో కీలక రంగాల్లో వృద్ధి 6.7 శాతానికి పరిమితమైనట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజాగా వెల్లడించింది. జనవరి నెలలో నమోదైన 4.1 శాతం కంటే భారీగా పెరిగినప్పటికీ, క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 7.4 శాతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ఎరువులతోపాటు రిఫైనరీ ఉత్పత్తులు, స్టీల్, విద్యుత్ రంగాలు నిరాశాజనక పనితీరు కనబరిచాయి.
అయినప్పటికీ, బొగ్గు 11.6 శాతం పెరగగా, క్రూడాయిల్ 7.9 శాతం, సహజ వాయువు 11.3 శాతం, సిమెంట్ 10.2 శాతం చొప్పున వృద్ధిని కనబరిచాయి. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో కీలక రంగాల్లో వృద్ధి 8.2 శాతం నుంచి 7.7 శాతానికి పరిమితమైంది. దేశీయ పారిశ్రామిక ప్రగతిలో కీలక రంగాల వాటా 40 శాతంగా ఉన్నది. ఈ సందర్భంగా ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ మాట్లాడుతూ..ఫిబ్రవరి నెలలో కీలక రంగాలు మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని, ఎనిమిది రంగాల్లో మూడు రెండంకెల వృద్ధిని సాధించడం వల్ల ఇది సాధ్యమైందన్నారు.