హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ (ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ, ఎఫ్ఐటీ) తెలంగాణలో తమ కంపెనీని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా అదనపు భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. హైదరాబాద్లో ఒకేచోట లభ్యంకాకున్నా వేర్వేరు ప్రాంతాల్లోనైనా భూములు తీసుకునేందుకు సంస్థ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
చైనాలో తమ కార్యకలాపాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన తైవా న్ సంస్థ ఫాక్స్కాన్.. క్రమంగా భారత్లో తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే చెన్నైలో మొబైల్ ఫోన్ల తయారీ సంస్థను ఏర్పాటు చేయగా, ఇటీవలే బెంగళూరులో కూడా కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే తెలంగాణలో సైతం ఈ ఏడాది మే నెలలో కొంగరకలాన్లో పరిశ్రమ నిర్మాణ పనులు చేపట్టింది. కొంగరకలాన్లో సుమారు 196 ఎకరాల్లో ఫాక్స్కాన్ రూ.4,562 (550మిలియన్ డాలర్లు)కోట్ల పెట్టుబడితో ప్లాంట్ను తెస్తున్నది. ప్రత్యక్షంగా 25వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక అనుకూల, స్నేహపూర్వక విధానాలతో ఫాక్స్కాన్ సంస్థ తెలంగాణలో పెట్టుబడి ప్రకటన చేసిన కొద్దిరోజులకే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని పరిశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్కు మెజారిటీ సప్లయర్ ఫాక్స్కానే. ఐపాడ్లు, వైర్లెస్ ఇయర్ఫోన్ల తయారీకీ ఇటీవలే యాపిల్ నుంచి ఆర్డర్ను కూడా అందుకున్నది. ప్రస్తుతం చైనాకు చెందిన కంపెనీలు యాపిల్కు వైర్లెస్ ఇయర్ఫోన్లు, చార్జర్లను సరఫరా చేస్తున్నాయి. అయితే తాజాగా వాటిని సైతం భారత్లోనే తయారు చేయించాలని యాపిల్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కేంద్రం గా ఏర్పాటుచేస్తున్న పరిశ్రమలో సాధ్యమైనంత తొందర్లోనే ఉత్పత్తి ప్రారంభించాలని ఫాక్స్కాన్ కంపెనీ సంకల్పించింది. కంపెనీ ప్రణాళికలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది. ఈ ఏడాది మొదట్లో ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూపు చైర్మన్ యంగ్ లియు హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమై తమ పెట్టుబడి ప్రణాళికలపై చర్చించిన విషయం తెలిసిందే.