Shock for China Co’s | భారత్లో డ్రాగన్ కంపెనీలు.. ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్ కంపెనీల లావాదేవీలపై నిఘా మొదలైంది. షియోమీ, ఒప్పో, వివో వంటి స్మార్ట్ ఫోన్ సంస్థల యాజమాన్యాలు కొన్నేండ్లుగా సమర్పిస్తున్న ఫైనాన్సియల్ ఫైలింగ్స్లో లోపాలు, వ్యత్యాసాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది. తమకు వస్తున్న ఆదాయ వివరాలు దాచిపెట్టి, పన్నులు ఎగ్గొటడానికి లాభాలు తొక్కిపడుతున్నారని సమాచారం. దేశీయ మార్కెట్లో స్థానిక కంపెనీలకు నష్టం కలిగించేలా.. స్మార్ట్ ఫోన్ల కంపెనీలు తప్పుడు వ్యూహాలు అమలు అమలు చేస్తున్నాయని వినికిడి. ఆయా ఫోన్ల కాంపొనెంట్స్ వనరులు, ఉత్పత్తుల పంపిణీపై పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీల ఆఫీసులపై ఇటీవల దర్యాప్తు సంస్థలు దాడులు చేసి సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో ఆదాయం పన్నుశాఖ, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) పాల్గొన్నాయి. ఆంక్షలతో కూడిన వాణిజ్య పద్దతులు, ఆధిపత్యం కోసం అడ్డదార్లు తొక్కుతున్నాయన్న ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దర్యాప్తు చేపట్టనున్నదని వినికిడి. ఆయా సంస్థల పన్ను చెల్లింపులు, ఎగవేత పద్దతులు, తప్పుడు తడకల డాక్యుమెంట్ల తయారీ తదితర అంశాలపై దర్యాప్తును కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ పరిశీలిస్తున్నది.
టాప్ స్లాట్స్లో కొనసాగుతున్నా.. భారీ విక్రయాలు జరుగుతున్నా ప్రధాన చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ నిర్వహణ నష్టాలను ఎదుర్కొంటున్నాయట. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వద్ద ఫైల్ అయిన పత్రాలు ఈ సంగతులు చెబుతున్నాయి. అవకతవకలపై షియోమీ, ఒప్పో, వివో వంటి సంస్థల నుంచి సమాధానాలు రాలేదు.
కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాల్లో ఆయా చైనా కంపెనీలు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నాయని తెలుస్తున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ మార్కెట్లో రూ. లక్ష కోట్లకు పైగా టర్నోవర్ సాధించినా, ఆదాయాలు పెంచుకున్నాయి. కానీ 2020-21 ఆర్థిక సంవత్సర ఫైనాన్సియల్ రికార్డ్స్ సమర్పించలేదు. షియోమీ, ఒప్పో, వివో ఇప్పటి వరకు భారత్లో పన్ను చెల్లించలేదు. ఒప్పో, వివో 2016-17 నుంచి నెగెటివ్ ఫలితాలు చూపుతున్నాయి.
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ లీడర్నని చెప్పుకుంటున్న షియోమీ.. భారీ నష్టాలు చూపుతున్నది. కొన్నేండ్లుగా భారత్లో ఎదుగుతున్న చైనా కంపెనీలు.. పైపైకి దూసుకెళ్తుండగా, దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీలు లారా, కార్బోన్, మైక్రోమాక్స్, ఇంటెక్స్ శరవేగంగా పడిపోయాయి. కొన్నేండ్ల క్రితం వరకు ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన ఇండియన్ కంపెనీలు సింగిల్ డిజిట్ వాటాలకు పరిమితం అయ్యాయి. ఇదిలా ఉంటే ఒప్పో, వివో వంటి కంపెనీలు దేశీయ కంపెనీలతో డిస్ట్రిబ్యూషన్ చేపడుతున్నాయి. దేశంలో నేరుగా సప్లయ్ చైన్ ప్రారంభించడం లేదు.