మనలో బ్యాంక్ సేవింగ్స్ ఖాతా లేనివారుండరు. కానీ ఆ ఖాతా నిర్వహణ కోసం మనం చెల్లిస్తున్న రకరకాల చార్జీల గురించి మాత్రం చాలామందికి తెలియదు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు వివిధ సేవలకుగాను మన ఖాతా నుంచే నేరుగా ఈ చార్జీలను మినహాయించుకుంటున్నాయి. ఆవి ఇవే..
నగదు లావాదేవీలు
నెలలో మూడుసార్లు లేదా కొన్ని బ్యాంకుల్లో ఐదుసార్లకు మించి నగదు లావాదేవీలను పొదుపు ఖాతా నుంచి నిర్వహిస్తే బ్యాంకులు చార్జీలేస్తున్నాయి. నగదు విత్డ్రా లేదా డిపాజిట్లపైనా పరిమితులున్నాయి. ఇతర బ్రాంచీలలో నగదు డిపాజిట్ చేయడంపైనా పరిమితి ఉండగా, ఆపై నగదు లావాదేవీలన్నింటికీ చార్జీలు తప్పవు.
ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు
బ్యాంకు తమ ఏటీఎంల నుంచి నెలకు ఐదు లావాదేవీలను నిర్వహించుకోవడానికే అనుమతిస్తున్నాయి. ఆ తర్వాత విత్డ్రాయల్స్కు ఎస్బీఐ రూ.20, ఐసీఐసీఐ రూ.50 వసూలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఐదుసార్ల వరకూ ఉచితంగా విత్డ్రా చేసుకోవడానికి అనుమతిస్తున్నాయి.
ఐఎంపీఎస్ ట్రాన్స్ఫర్
నెఫ్ట్, ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్లను రిజర్వ్ బ్యాంకు ఉచితం చేసింది. అయితే వెంటనే బదిలీచేసే ఐఎంపీఎస్ ట్రాన్స్ఫర్లు మాత్రం ఉచితం కాదు. ఎంత మొత్తాన్ని బదిలీ చేస్తున్నారన్నదాన్నిబట్టి చార్జీలున్నాయి. ఒక రూపాయి నుంచి రూ. 25 వరకు చార్జీ పడుతున్నది.
ఫెయిల్డ్ ఏటీఎం లావాదేవీలు
ఏటీఎంలలో లావాదేవీలు ఫెయిల్ అయితే చార్జీ చేయరాదని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది. అయితే సరిపడా బ్యాలన్స్ లేకుండా ఫెయిల్ అయితే మాత్రం బ్యాంకులు పెనాల్టీలను బాదుతున్నాయి. ఎస్బీఐ రూ.20, ప్రైవేట్ బ్యాంకులు రూ.25 చొప్పున వసూలు చేస్తున్నాయి.
కనీస బ్యాలన్స్
ప్రతీ బ్యాంక్.. ఖాతాలో కనీస బ్యాలన్స్ నిబంధన విధిస్తున్నది. సాలరీ అకౌంట్లో మాత్రమే జీరో బ్యాలన్స్ ఉండవచ్చు. దీంతో మిగతా ఖాతాల్లో కనీస నగదు నిల్వలు లేకపోతే చార్జీలే.
డాక్యుమెంట్ చార్జీలు
బ్యాంకులు జారీచేసే వివిధ డాక్యుమెంట్లకు చార్జీలను వసూలు చేస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ సంతకం వెరిఫికేషన్ డాక్యుమెంట్కు రూ.150 వసూలు చేస్తున్నది. ఏడాదికోసారి బ్యాంకు స్టేట్మెంట్ ఉచితం. కానీ అదనంగా కావాలంటే రూ.50-100 ఇవ్వాల్సిందే.
డెబిట్ కార్డ్
డెబిట్ కార్డును రీప్లేస్ చేయాలంటే బ్యాంకులు రూ.500 వరకు చార్జీ చేస్తున్నాయి. ఒకవేళ ఏటీఎం పిన్ నెంబర్ మార్చుకోవాలన్నా ఫీజు చెల్లించాల్సిందే. ఇవిగాక ఎస్ఎంఎస్ చార్జీలు కూడా ఉంటాయి. ప్రతీ లావాదేవీకి అలర్ట్ రావాలంటే తప్పదుమరి. అయితే ఇందులో ఓటీపీ మెసేజ్లకు మాత్రం మినహాయింపు ఉంది.
చెక్: లక్ష రూపాయలకు పైబడి ఉండే చెక్కులను వెంటనే క్లియర్ చేయడానికి రూ.150 మించి చార్జీ చేయకూడదని రిజర్వ్ బ్యాంకు నిబంధన పెట్టింది. లక్షలోపు చెక్కుల క్లియరింగ్కు ఛార్జీలు లేవు. ఒకవేళ చెక్కు బౌన్స్ అయితే రూ.100 నుంచి రూ.150 వరకు ఫైన్ చెల్లించాల్సిందే.