NITI Aayog CEO | నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బీవీఆర్ సుబ్రమణ్యం నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ (సీసీఏ) నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం నీతి ఆయోగ్ సీఈవోగా పని చేస్తున్న పరమేశ్వరన్ అయ్యర్.. ప్రపంచబ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వెళ్లనున్న నేపథ్యంలో ఆయన స్థానే సుబ్రమణ్యాన్ని కేంద్రం నియమించినట్లు తెలుస్తున్నది. గతేడాది జూన్లో నీతి ఆయోగ్ సీఈవోగా పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యారు.
పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో నియమితులైన బీవీఆర్ సుబ్రమణ్యం ఇంతకుముందు ఆయన జమ్ముకశ్మీర్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణం రద్దు, జమ్ముకశ్మీర్ను జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడంలో కేంద్రానికి కీలకంగా వ్యవహరించిన అధికారుల్లో సుబ్రమణ్యం ఒకరని తెలుస్తున్నది.
ఇప్పటి వరకు ప్రపంచబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేసిన రాజేశ్ ఖుల్లార్ పదవీ కాలం ముగిసింది. దీంతో ఆయన తన సొంత రాష్ట్రం హర్యానాకు వెళ్లనున్నారు. రాజేశ్ ఖుల్లార్.. 1988 బ్యాచ్ హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి.
1987 బ్యాచ్ ఛత్తీస్గఢ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సుబ్రమణ్యం.. గతేడాది రిటైర్మెంట్ కావడానికి కొన్నిరోజుల ముందు 2022 సెప్టెంబర్లో భారత వ్యాపార ప్రోత్సాహక మండలి (India Trade Promotion Organisation-ITPO) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా రెండేండ్ల కాంట్రాక్ట్ పద్దతిలో నియమితులయ్యారు. అంతకుముందు ఛత్తీస్ గఢ్ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సుబ్రమణ్యంను జమ్ముకశ్మీర్కు డిప్యూటేషన్పై కేంద్రం పంపింది.
2004-08 మధ్య నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రైవేట్ కార్యదర్శిగానూ సుబ్రమణ్యం పని చేశారు. అటుపై ప్రపంచబ్యాంకులో కొంత కాలం పని చేశాక 2012లో తిరిగి పీఎంవోలో నియమితులయ్యారు.