NSE Chitra |నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ దేశం విడిచి వెళ్లకుండా సీబీఐ సీబీఐ లుక్ఔట్ నోటీసు జారీ చేసింది. ఆమెతోపాటు సంస్థ మరో మాజీ సీఈవో రవి నారాయణ్, మాజీ సీవోవో ఆనంద్ సుబ్రమణ్యంలపై కూడా లుక్ఔట్ నోటీసులు జారీ చేసింది. ఎన్ఎస్ఈ కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై చిత్రా రామకృష్ణను సీబీఐ గురువారం విచారించింది.
ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటర్జిక్ అడ్వైజర్గా ఆనంద్ సుబ్రమణ్యం నియామకం, ఆ వెంటనే ప్రమోషన్లు తదితర అంశాలపై చిత్రా రామకృష్ణను సీబీఐ ప్రశ్నించిందని సమాచారం. ఇదే కేసులో ఢిల్లీలోని ఓపీజీ సెక్యూరిటీస్ ప్రమోటర్ సంజయ్ గుప్తాపైనా కేసు నమోదైంది. సంజయ్ గుప్తా ఎన్ఎస్ఈ సర్వర్ ఆర్కిటెక్చర్గా పని చేశారు. గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి కుట్రకు పాల్పడ్డారని సీబీఐ అభియోగం. ఎన్ఎస్ఈ, సెబీల్లో పని చేసిన, చేస్తున్న మరి కొందరిని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రశ్నించినట్లు సమాచారం.
దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఎన్ఎస్ఈకి సేవలందించిన చిత్రా రామకృష్ణ 2016 డిసెంబర్లో వ్యక్తిగత కారణాల రీత్యా సంస్థ సీఈవోగా వైదొలిగారు. బోర్డు సభ్యులతో విబేధాల వల్లే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. కానీ, తర్వాత చిత్రా రామకృష్ణపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చర్యలకు పూనుకున్నది.
స్టాక్ బ్రోకర్లకు కో-లొకేషన్ కేసులో చిత్రా రామకృష్ణ అక్రమ లబ్ధి లబ్ధి చేకూర్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2013-14లో ఆమె డ్రా చేసుకున్న వేతనంలో నాలుగోవంతు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (ఐపీఈఎఫ్)లో జమ చేయాలని ఆదేశించింది. ఐదేండ్ల పాటు ఏ లిస్టెడ్ కంపెనీతో గానీ, మార్కెట్ మౌలిక వసతుల సంస్థతో పని చేయయకుండా నిషేధం విధించింది.