ఈ ఎండాకాలంలో కూరగాయల ధరల కదలికల్ని పరిశీలించాల్సిన అవసరం మాకున్నది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయాలన్నదే మా లక్ష్యం. ఈ లక్ష్య సాధనకు ఆహార ద్రవ్యోల్బణం అదుపు చాలా కీలకం. కానీ జూన్దాకా వడగాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ చెప్తున్నది. మొత్తానికి సాధారణ వర్షపాతం ఈసారి ఉంటుందనే ఆశిస్తున్నాం. అదే జరిగితే పంట దిగుబడులు బాగుంటాయి. ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అయితే భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం కూడా ఉంటున్నది. చమురు ధరలూ కీలకమే.
-శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్
UPI | ముంబై, ఏప్రిల్ 5: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) అప్లికేషన్ల (యాప్స్)కు మరింత కిక్కిచ్చే నిర్ణయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను చేపట్టిన తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎంతో ప్రజాదరణ పొందిన యూపీఐ వినియోగం ద్వారా బ్యాంకుల్లో నగదు డిపాజిట్లకు వీలు కల్పించనున్నట్టు స్పష్టం చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను తీసుకొస్తామని చెప్పారు.
ఈ సదుపాయం గనుక అందుబాటులోకి వస్తే మొబైల్ ఫోన్ యూజర్లకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువైనట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ప్రస్తుతం డెబిట్ కార్డులతోనే బ్యాంకులు, ఏటీఎం సెంటర్లలో ఉన్న క్యాష్ డిపాజిట్ మెషీన్ల (సీడీఎం) ద్వారా ఖాతాల్లో నగదును జమ చేసుకునే సౌకర్యం ఖాతాదారులకున్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు యూపీఐతో సీడీఎంల్లో నగదు డిపాజిట్ సదుపాయాన్ని తెచ్చేందుకు ఆర్బీఐ నిర్ణయించింది. దీనివల్ల కస్టమర్లకు మరింత సులువుగా పనైపోతుందన్న భావనను ఆర్బీఐ వెలిబుచ్చుతున్నది. ఇప్పటికే యూపీఐ ద్వారా కార్డ్-లెస్ క్యాష్ విత్డ్రాయల్స్ సౌకర్యం ఏటీఎంల్లో ఉన్నది తెలిసిందే.
పీపీఐ యూజర్లకు జోష్
వినియోగదారుల సౌకర్యార్థం థర్డ్-పార్టీ యూపీఐ యాప్స్ ద్వారా ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల (పీపీఐ) అనుసంధానానికి అనుమతినివ్వాలని ఆర్బీఐ నిర్ణయించింది. ప్రస్తుతం స్మార్ట్ కార్డులు, ఆన్లైన్ అకౌంట్లు, ఆన్లైన్ వ్యాలెట్లు, స్ట్రిప్ కార్డులు, పేపర్ వోచర్లు వంటి పీపీఐల జారీదారులు కల్పించిన యాప్ వినియోగం ద్వారానే యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో బ్యాంక్ ఖాతాదారుల మాదిరే పీపీఐ యూజర్లూ యూపీఐ పేమెంట్స్ను సులువుగా చేసుకోగలరు. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే వెలువడుతాయని ఆర్బీఐ ఈ సందర్భంగా తెలిపింది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాల నుంచి యూపీఐ చెల్లింపులు సదరు యూపీఐ యాప్ (గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం మొదలగునవి) ఆ బ్యాంక్ ఖాతాతో లింకై ఉంటేనే జరుగుతున్నది విదితమే. అయితే ఈ సౌకర్యం పీపీఐలకు ఇప్పుడు లేదు. ఇకపై రానున్నది.
రిటైల్ ఇన్వెస్టర్ల కోసం యాప్
ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా ప్రభుత్వ బాండ్ల మార్కెట్లో రిటైల్ మదుపరుల సౌకర్యార్థం ఓ మొబైల్ యాప్ను తీసుకురానున్నట్టు ఆర్బీఐ గవర్నర్ దాస్ వెల్లడించారు. 2021 నవంబర్లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీంను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి, ఆర్బీఐతో గిల్డ్ ఖాతాలను నిర్వహించడానికి వ్యక్తిగత మదుపరులకు ఇది వీలు కల్పించింది. నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్-ఆర్డర్ మ్యాచింగ్ సిస్టమ్ (ఎన్డీఎస్-ఓఎం) వేదిక ద్వారా సెక్యూరిటీల క్రయవిక్రయాలు, ప్రైమరీ వేలాల్లో బాండ్ల కొనుగోలుకు రిటైల్ ఇన్వెస్టర్లకు అవకాశమిచ్చింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లకు మరింత సౌకర్యంగా ఉండేలా రిటైల్ డైరెక్ట్ పోర్టల్కు చెందిన మొబైల్ యాప్ను సిద్ధం చేశామని గవర్నర్ దాస్ తెలియజేశారు. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ప్రభుత్వ బాండ్లను కేంద్రం తరఫున ఆర్బీఐనే జారీ చేస్తుందన్న సంగతి విదితమే.
కీలక వడ్డీరేట్లు యథాతథం
వరుసగా ఏడోసారీ కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగానే ఉంచింది. రెపోరేటు 6.5 శాతంగానే ఉన్నది. ఇది తగ్గితే వాహన, గృహ, వ్యక్తిగత తదితర రుణగ్రహీతలకు ఈఎంఐల భారం దిగి ఊరట దక్కేది. తాజా ద్రవ్యసమీక్షలో పాల్గొన్న ఆరుగురు సభ్యుల్లో రెపోరేటు జోలికి వెళ్లవద్దని ఐదుగురు సభ్యులు ఓటేశారు. కాగా, ఆగస్టు నుంచి వడ్డీరేట్లు తగ్గొచ్చన్న అంచనాలు ఉన్నాయి.
ఆర్బీఐ ద్రవ్యసమీక్ష ముఖ్యాంశాలు
పసిడి నిల్వలు పైపైకి..
దేశంలో బంగారం నిల్వల్ని పెంచుకుంటూపోతున్నామని ఆర్బీఐ గవర్నర్ దాస్ తెలిపారు. ఫారెక్స్ రిజర్వుల బలోపేతంలో భాగంగానే ఇదంతా అన్నారు. అయితే ఏ స్థాయిలో బంగారాన్ని కొంటున్నారో ఆ వివరాలను మాత్రం చెప్పలేదు. అయినప్పటికీ క్రమేణా పసిడి నిల్వల్ని పెంచుతున్నామని మాత్రం చెప్పారు. ఇదిలావుంటే ఈ ఏడాది మార్చి 29 నాటికి దేశీయ ఫారెక్స్ రిజర్వుల్లో బంగారం వాటా 52.16 బిలియన్ డాలర్లుగా ఉన్నది. గత ఏడాది మార్చి ఆఖరుతో పోల్చితే గోల్డ్ రిజర్వుల విలువ దాదాపు 7 బిలియన్ డాలర్లు పెరిగింది. కాగా, ఈ ఏడాది జనవరిలో ఆర్బీఐ 8.7 టన్నుల పుత్తడిని కొన్నట్టు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. గడిచిన రెండేండ్లలో ఇదే గరిష్ఠం. ఈ జనవరి చివరి నాటికి ఆర్బీఐ వద్ద 812.3 టన్నుల బంగారు నిల్వలున్నాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) లెక్కలతో తెలుస్తున్నది. గత నెల 29 నాటికి దేశీయ ఫారెక్స్ రిజర్వులు ఆల్టైమ్ హైని తాకుతూ 645.58 బిలియన్ డాలర్లకు చేరాయి. వారం రోజుల్లోనే 2.95 బిలియన్ డాలర్లు పెరిగాయి.