Car Price | మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అయితే త్వర పడండి.. 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పలు కంపెనీల కార్ల ధరలు పెరగనున్నాయి. కార్ల తయారీ ఖర్చు పెరిగిపోయిందన్న పేరుతో వాటి ధరలు పెంచుతున్నట్లు ఆటోమొబైల్సంస్థలు చెబుతున్నాయి. కనుక ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తే మరింత ఖర్చుచేయాల్సి వస్తుంది. ఆటోమొబైల్ రంగ నిపుణుల అంచనా ప్రకారం కార్ల ధరలు రూ.50 వేల వరకు పెరుగుతాయని తెలుస్తున్నది. బడ్జెట్ కార్లు లేదా లోబడ్జెట్ కార్ల ధరలు 20 నుంచి 25 శాతం వరకు పెరుగుతాయని చెబుతున్నారు. 2020 ఏప్రిల్ నుంచి బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి వచ్చినప్పుడు కూడా ఆయా కార్ల ధరలు దాదాపు రూ.50 వేల చొప్పున పెరిగాయి.
అగ్రశేణి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కార్ల ధరలు పెరుగుతాయని ప్రకటించింది కానీ.. ఎంత మొత్తంలో పెరుగుతాయన్న సంగతి వెల్లడించలేదు. దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్ ఇండియా తమ కార్ల ధరలు రెండు మూడు శాతం పెరుగుతాయని తెలిపింది. అప్డేటెడ్ సోనెట్ రూ.7.79 లక్షలు, సెల్టోస్ రూ.10.89 లక్షలు, కరెన్స్ రూ.10.45 లక్షలకు పెరుగనున్నాయి. ఎంజీ మోటార్ ఇండియా సైతం తన కార్ల ధరలు ఇప్పటికే పెంచేసింది. ఎంజీ గ్లొస్టర్, హెక్టర్ డీజిల్ వేరియంట్ కార్లు రూ.60 వేలు, హెక్టర్ పెట్రోల్ వేరియంట్ రూ.40 వేలు పెరిగింది.
టాటా మోటార్స్, హోండా కార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాతోపాటు టూ వీలర్స్ తయారీ కంపెనీలు హీరో మోటో కార్ప్, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్, బజాజ్ ఆటో వంటి సంస్థల బైక్లు, స్కూటర్ల ధరలు పెరుగుతాయి. హోండా కార్స్ ఇండియా తన ఎంట్రీ లెవల్ కంపాక్ట్ సెడాన్ కారు అమేజ్ ధర రూ.12 వేలు పెరుగుతుందని తెలిపింది. టాటా మోటార్స్ తన వెహికల్స్ ధర 5 శాతం పెరుగుతుందని ఇంతకుముందే ప్రకటించింది.
పర్యావరణ పరిరక్షణ కోసం వాయు కాలుష్యం నియంత్రణపై కేంద్రం దృష్టి సారించింది. కాలుష్య నియంత్రణకు రెండోదశ బీఎస్-6 ప్రమాణాలు పాటించాల్సిందేనని ఆటోమొబైల్ సంస్థలకు తేల్చి చెప్పింది. కార్లు మొదలు బైక్స్, స్కూటర్లు, ఇతర వెహికల్స్ విడుదల చేసే ఉద్గారాలు నిర్దేశిత పరిమితి దాటొద్దు. ఇప్పటిదాక ల్యాబ్స్లో వెహికల్స్ విడుదల చేసే ఉద్గారాలను పరీక్షించిన తర్వాత మార్కెట్లోకి తేవాలి.
ఉద్గారాల నియంత్రణకు పోర్టబుల్ ఎమిషన్ మెజర్మెంట్ సిస్టమ్ బిగించాలి. ఇక డీజిల్ వేరియంట్ వెహికల్స్లో సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ (ఎస్సీఆర్) అనే పరికరం తప్పనిసరిగా అదనంగా అమర్చాలి. డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్యూయిడ్ను ఉపయోగించి నెట్రోజన్ ఆక్సైడ్లోని ఉద్గారాలను నీరుగా మార్చి బయటకు విడుదలచేస్తుంది.
కార్ల డ్రైవర్లకు ఈ విషయాలన్నీ తెలిసేలా ఆన్బోర్డ్ సెల్ఫ్ డయాగ్నస్టిక్ డివైజ్ను అన్ని కార్లలో కార్ల తయారీ సంస్థలు తప్పనిసరిగా అమర్చాలి. కారు డ్రైవింగ్లో చేయాల్సిన మార్పులు, ట్రాఫిక్ పరిస్థితులు ఎప్పటికప్పుడు కారు డ్రైవర్కు తెలియజేస్తుంది. ఉద్గరాలు (ఎమిషన్స్) నియంత్రణ పరిధి దాటితే వెంటనే సర్వీసింగ్ చేయించాలని సూచన చేస్తుంది. ఈ సూచనలతో పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతుందని కేంద్రం అంచనా వేస్తున్నది.
Maruti Cars Costly | ఏప్రిల్ నుంచి మారుతి కార్ల ధరలు పిరం.. ఇతర కార్లూ బైక్లు కూడా