న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: రెట్రోస్పెక్టివ్ పన్ను చట్టాన్ని రద్దుపర్చిన నేపథ్యంలో భారత్ ప్రభుత్వం ఆఫర్ చేసిన 1 బిలియన్ డాలర్ల (రూ.7,330 కోట్లు) రిఫండ్ ఆఫర్ తమకు ఆమోదయోగ్యమేనని యూకేకు చెందిన ఇంధన కంపెనీ ఎయిర్న్ ఎనర్జీ తెలిపింది. రిఫండ్ మొత్తం అందిన ఒకటి, రెండు రోజుల్లోగా వివిధ దేశాల్లో భారత్ ఆస్తుల జప్తునకు తాము వేసిన కేసుల్ని ఉపసంహరించుకుంటామని మంగళవారం కెయిర్న్ సీఈవో సైమన్ థామ్సన్ చెప్పారు. పారిస్లోని రాయబార భవనాల్ని, అమెరికాలో ఎయిర్ ఇండియాకు చెందిన భవనాలు, విమానాల్ని స్వాధీనపర్చుకునేందుకు ఆయా దేశాల్లో కెయిర్న్ కేసుల్ని దాఖలు చేసింది. రిఫండ్ ఆఫర్కు కెయిర్న్ ప్రధాన షేర్హోల్డర్లయిన బ్లాక్రాక్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లు ఆమోదం తెలిపినట్లు థామ్సన్ వెల్లడించారు. పాత లావాదేవీలకు తాజాగా పన్ను విధించేందుకు వీలుకల్పించే రెట్రో పన్ను చట్టాన్ని ఇటీవల కేంద్రం రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టం కింద షేర్ల విక్రయం ద్వారా గతంలో కెయిర్న్ నుంచి ప్రభుత్వం రూ.7,900 కోట్లు వసూలుచేసుకుంది. ఈ వివాదంపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో అనుకూల ఆవార్డును పొందిన కెయిర్న్ వివిధ దేశాల్లో భారత్ ఆస్తుల స్వాధీనానికి కేసుల్ని వేసింది.